జగన్ దెబ్బకు దెబ్బ- ఏబీవీ డిస్మిస్: వైసీపీ 23 మంది జంపింగ్-నంద్యాల బైపోల్..!!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్..చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీని పక్కన పెట్టారు. అప్పటి నుంచి ఆయన పైన విచారణ కొనసాగుతోంది. ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఏబీపై కొనసాగుతున్న విచారణ..
నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతోపాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆయన సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ సిసోడియాను విచారణాధికారిగా నియమించారు.
డిస్మిస్ చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు..
ఈలోగా..ఏబీ వేంకటేశ్వర రావుపైన ఏకంగా డిస్మిస్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఏబీవీపై మేజర్ పెనాల్టీ (డిస్మిస్) అమలు చేయాలని కేంద్ర హోం శాఖకు ఈ జీవో ద్వారా ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపారు. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల డిస్మిస్ వ్యవహారాలన్నీ కేంద్రమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులను, అభియోగ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాక... యూపీఎస్సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
కేంద్ర నిర్ణయమే ఫైనల్..
రాష్ట్ర ప్రభుత్వం ఏ సిఫారసు చేసినప్పటికీ అంతిమంగా కేంద్ర నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలుత అనురాధ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. ఆ తరువాత శేషాచలం ఎన్ కౌంటర్ తరువాత అనురాధను తప్పించి ఏబీ వేంకటేశ్వర రావును నాడు సీఎం చంద్రబాబు నిఘా చీఫ్ గా నియమించారు. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయంగా టీడీపీకి మేలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ అప్పటి నుంచే ఆరోపిస్తూ వచ్చింది.
23 మంది జంపింగ్..నంద్యాల బైపోల్..
వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. ఇక, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నిఘా చీఫ్ గా ఏబీ నంద్యాలలోనే మకాం వేసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా జగన్ ఆరోపించారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు ఆయనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను ఇంటెలిజెన్స్ నుంచి ఈసీ తప్పించింది.
Recommended Video
జగన్ సీఎం అయిన తరువాత..
వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏసీబీ డీజీగా ఉన్న ఏబీవీని బదిలీ చేసి కొన్నాళ్లపాటు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్)తోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏబీవీపై నమోదైన అభియాగాలన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. ఏ న్యాయస్థానంలోనూ ఇవి ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏపీ ప్రభుత్వ సిఫార్సుల పైన ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.