ఏపీలో పాఠశాలల సెలవుల పొడిగింపు- ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం....
ఏపీలో కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అన్ని పాఠశాలల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి రేపటితో విద్యా సంవత్సరం ముగియాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో ప్రస్తుతానికి సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. మిగతా అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
స్కూళ్లకు సెలవుల పొడిగింపు..
ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు ఓ సర్క్యులర్ ను జారీ చేశారు. వాస్తవానికి 2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు జరపకుండానే సెలవులను ప్రకటించారు. ఆపై లాక్ డౌన్ మరోమారు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే సెలవులను కూడా పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మే 3 తర్వాతే పరీక్షలపై నిర్ణయం..
మే 3 తరువాత పరిస్థితిని సమీక్షించి సలవులను పొడిగించాలా? లేక పరీక్షలు నిర్వహించాలా? అన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఏపీలో ఇంటర్, టెన్త్ విద్యార్థుల పరీక్షలు లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకూ నిర్వహించలేదు. మిగతా తరగతుల వారికి మాత్రం హాజరు ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కీలకమైన పదో తరగతి పరీక్షల నిర్వహణ జరపక తప్పని పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం మే 3 తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications