ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వారి పైన నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. అంతేకాదు అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనలో కీలక మినహాయింపునిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను హోంశాఖ, పాఠశాల విద్యాశాఖ వేరువేరుగా వెల్లడించింది.
గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దుకు ఆందోళన చేసిన ఉపాధ్యాయులు
సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2022 లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు ఉపాధ్యాయులు చేరుకున్నారు. నాటి ప్రభుత్వ అంచనాలకు మించి భారీ సంఖ్యలో విజయవాడకు తరలి వచ్చిన ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

73మంది ఉపాధ్యాయులపై కేసుల ఉపసంహరణ
సీఎం కార్యాలయం ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేసిన పోలీసులు ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో 73 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన గత వైసిపి సర్కార్ కేసులు పెట్టింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కేసులను ఉపసంహరించుకోవడంతో 73 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది.
ఆ ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నిర్ణయంలో భాగంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో గత రెండు మూడేళ్లుగా కేసుల ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులకు రిలీఫ్ దొరికింది.
అంధ ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి హాజరువిధానం నుండి మినహాయింపు
ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి హాజరు విధానం నుంచి మినహాయింపు పైన ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్కూల్స్ లో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం నుండి అంధ ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి మినహాయింపుని ఇచ్చింది. విద్యాశాఖ ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు వీరి హాజరును ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లీవ్ యాప్లో నేరుగా నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయాలతో ఉపాధ్యాయుల హర్షం
ఈ మినహాయింపు తో అంధ ఉపాధ్యాయులు ఎటువంటి సాంకేతిక సమస్య లేకుండా, తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇవి మాత్రమే కాదు త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా రెడీ అవుతున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పురోగతికి పెద్దపీట వేస్తోంది.












Click it and Unblock the Notifications