ఏపీలో వైద్య విద్య కోర్సుల ఫీజుల పెంపు..! ఈ కాలేజీల్లో వర్తింపు..!
ఏపీలో వైద్య విద్య ఫీజుల్ని పెంచుతూ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫీజుల్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27కు ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలకు ఈ మధ్యంతర ఫీజు విధానం ఖరారు చేస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26లో ఖరారు చేసిన ఫీజులపై 15 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
2025-26 విద్యా సంవత్సరానికి గతంలో నిర్ణయించిన ఫీజుపై 15 శాతం ఫీజును పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో గతంలో ఉన్న వార్షిక ట్యూషన్ ఫీజు రూ.17.25 లక్షల నుంచి రూ.19.83 లక్షలకు పెరిగింది. దీన్ని రాష్ట్రంలోని 5 ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజీలకు వర్తింపజేశారు. ఇందులో రాజమండ్రి జీఎస్ఎల్, గుంటూరు కాటూరి, ఎన్నారై, నెల్లూరు నారాయణ, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే మధ్యంతర ఫీజు వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తుది ఫీజును APHEFRMC ఖరారు చేసిన తర్వాత మధ్యంతర ఫీజు మార్పు ఉంటుందని తెలిపింది.

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో నిర్ణీత ఫీజు కంటే అధికంగా వసూలు చేయరాదని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చింది. తుది ఫీజు తక్కువగా ఉంటే విద్యార్థులకు అదనపు మొత్తాన్ని రీఫండ్ లేదా లేదా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అడ్మిషన్ సమయంలో ఫీజు మధ్యంతరమైనదేనని విద్యార్థులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఆయా కాలేజీలు ఈ మేరకు ఫీజు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్ లో కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150గా నిర్ణయించారు. మేనేజ్ మెంట్ కోటా ఫీజు రూ.14.52 లక్షలుగా నిర్ణయించారు. ఎన్నారై కోటాకు రూ.43.56 లక్షలు ఖరారు చేశారు. బీడీఎస్ కు కన్వీనర్ కోటాకు రూ.15,730 ఫీజుగా నిర్ణయించారు. మేనేజ్ మెంట్ కోటాకు రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా రూ.14.52 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. పీజీ కోర్సుల కన్వీనర్ కోటా ఫీజును రూ.5.71 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. మేనేజ్ మెంట్ కోటాకు రూ.11.42 లక్షలు, ఎన్నారై కోటాకు రూ.66.12 లక్షలు ఫీజు ఖరారు చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు రూ.19.38 లక్షలు ఫీజు నిర్ణయించారు.














Click it and Unblock the Notifications