అలర్ట్: ఏపీలో పింఛన్ల పంపిణీ డెడ్ లైన్: పొడిగింపు ఉండదు
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ పింఛన్ల పంపిణీ. ఈ నెల 1వ తేదీన రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
ఇప్పుడు మరోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతోన్నారు చంద్రబాబు. ఈ సారి ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మడకశిరలో పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అందజేయనున్నారు.

మడకశిర మండలంలోని గుండుమల ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యాక్రమంలో ఆయన పాల్గొంటారు. జులై నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడే రచ్చబండను నిర్వహించనున్నారు. పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి చర్చిస్తారు.దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం చకచకా పూర్తి చేస్తోన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్ సవిత, వై సత్యకుమార్ ఇందులో పాల్గొననున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం లోక్సభ సభ్యుడు బీకే పార్థసారథి సహా జనసేన, బీజేపీకి చెందిన పార్టీ నాయకులు దీనికి హాజరు కానున్నారు.
పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ.. మార్గదర్శకాలను విడుదల చేసింది. 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సిబ్బందికి ఆదేశించింది. మొదటి రోజే 99 శాతం పంపిణీని పూర్తి చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయాల్సి ఉంటుంది.

పింఛన్ల పంపిణీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు. మొదటి రోజు పింఛన్ల పంపిణీపై విస్తృతంగా ప్రచారం చేయాలి. సోషల్ మీడియా, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం, వాట్సప్, డప్పు కొట్టడం ద్వారా ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది స్థానిక అధికారులకు.
సచివాలయాల వారీగా పింఛన్ల మొత్తాలను ఇప్పటికే ఎంపీడీఓలు, కమిషర్లకు పంపించారు. ఈ నెల 31వ తేదీన సచివాలయాల బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. అదే రోజున ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయాల్సి ఉంటుంది. లబ్దిదారులకు అందజేయకుండా మిగిలి పోయిన పింఛన్ల మొత్తాన్ని 2వ తేదీ తరువాత మళ్లీ సెర్ప్కు పంపించాల్సి ఉంటుంది.
ఆ మొత్తం ఎందుకు పంపిణీ కాలేదు? ఎందుకు మిగిలిపోయిందనే విషయాలు, దీనికి గల కారణాలను 5వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీని ఆధారంగా సదరు లబ్దిదారుడికి ఆ తరువాతి నెలలో పింఛన్ను అందజేయాలా? వద్దా? అనేది ప్రభుత్వం నిర్ధారిస్తుంది.












Click it and Unblock the Notifications