వాలంటీర్ల సేవలు, వేతనాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీలో వాలంటీర్ల సేవలు..వేతనాలపై పై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవలను కొనసాగిస్తూనే..వారికి ఇచ్చే వేతనం రూ 10 వేలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. వాలంటీర్లకు విధులు లేకుండానే వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది.
కొనసాగుతున్న డైలమా
వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన అస్పష్టత కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు వలంటీర్లు రాజీనామా చేయగా, చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలినవారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్చార్ట్నూ అప్పగించలేదు. సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా.. వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికే పని చేయకుండానే ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పనిచేయకుండానే జీతాలు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

వేతనాల చెల్లింపు
మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండన్నర లక్షల మంది వలంటీర్లు ఉండగా, ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. దాదాపు లక్ష మందికిపైగా వాలంటీర్లకు విధులు కేటాయించకుండానేఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నెలకు సుమారుగా రూ.50 కోట్ల దాకా జీతాలుగా చెల్లిస్తున్నారు. వారు చేసే పింఛన్ పంపిణీని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులే సమర్థవంతంగా ఇంటి వద్దకే అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం వలంటీర్లు అవసరం లేదంటున్నారు. అయితే, వలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారినీ ఏదో పనికి ఉపయోగించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఏం చేయబోతున్నారు
ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదనే ప్రచారం జరిగింది. అప్పట్లో 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఓ వైపు పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. దీంతో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని కూటమి సర్కార్ నిరూపించింది. రెండో నెల పెన్షన్లను ఆగస్టు1న ఇదే విధంగా పంపిణీకి చర్యలు ప్రారంభించింది. దీంతో..అసలు వాలంటీర్ల విధుల విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications