రోడ్డున పడుతున్నాం.. చంద్రబాబుకు 12వేల మంది విజ్ఞప్తి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల పైన చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో గతంలో లానే రిటైల్ షాపులకు వేలం పాటల ద్వారా అనుమతులను ఇవ్వాలని నిర్ణయించింది.
మద్యం షాపులపై చంద్రబాబు నిర్ణయంతో వారికి షాక్
అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. నూతన మద్యం పాలసీ విధానం ద్వారా 12 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అనేకమార్లు తమ గురించి ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్న ఉద్యోగులు తాజాగా మరోమారు తమ ఆవేదన తెలియజేశారు.

ఎక్సైజ్ కమీషనర్ ను కలిసిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగులు
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కు తమ గోడును వెళ్ళబోసుకుంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారు నేడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగాలు పోతే రోడ్డున పడతామని ఆవేదన
తాము మద్యం దుకాణాల్లో గత ఐదేళ్లుగా పని చేస్తున్నామని కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను దృష్టిలో ఉంచుకుని ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన మద్యం పాలసీ ద్వారా 12 వేల మంది ఉద్యోగాలు అర్ధాంతరంగా కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని, తమ గతేమిటి అన్నది అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇప్పించండి
నూతన మద్యం పాలసీ విధానం పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, తమను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని కోరారు..తమలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం పొందే వయస్సు అర్హత కూడా కోల్పోయామని కాబట్టి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని తమకి న్యాయం చేయాలని కోరారు.తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు చొరవ చూపాలన్నారు.
ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది
దీనిపై ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్ కుమార్ స్పందించారని, తమ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. నారి వీరికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు.












Click it and Unblock the Notifications