అమరావతిపై ప్రభుత్వం మరో ట్విస్ట్ - నిర్ణయంపై హైకోర్టుకు నివేదన..!!
కొంత కాలంగా అమరావతి - మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేయనుంది. కొంత కాలంగా ఇది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. హైకోర్టులో రాజధాని తీర్పుకు ముందుగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుంది. అదే సమయంలో హైకోర్టు తీర్పు రావటం..ఆరు నెలల్లోగా నిర్మాణాల పైన కోర్టు చేసిన సూచనలతో ప్రభుత్వం సమయం పెంచాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. ఇక..ప్రభుత్వం నుంచి మంత్రులు కొందరు మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావన చేస్తూనే ఉన్నారు.

హైకోర్టుకా.. సుప్రీంలోనా
హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం న్యాయపరంగా ముందడుగు వేయలేదు. ఇప్పుడు హైకోర్టులో రాజధానికి సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. అమరావతిలో అభివృద్ధి పనులపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అమరావతి అంశం ప్రభుత్వం పరిశీలిస్తోందని కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన హైకోర్టులోనే రివ్యూకు వెళ్లాలా లేదక, సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తోందని స్పష్టం చేసారు. హైకోర్టు తీర్పు పైన రివ్యూ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచన చేసినట్లు చెప్పారు.

ప్రభుత్వ పరిశీలిస్తోందంటూ
రాజధానిలో నిర్మాణాలను సంబంధించి హైకోర్టు విధించిన గడువును అయిదేళ్లకు పొడిగించాలని కోరుతూ అనుంధ పిటీషన్ వేసిన విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. మరోవైపు హైకోర్టు తీర్పు వచ్చినా అమరావతి పనుల్లో పురోగతి లేదని రైతుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫింఛన్లు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. ఏజీ కోర్టుకు నివేదించిన అంశాలు.. సుప్రీంలో ఎస్ఎల్పీ దాఖలై ఉన్న నేపథ్యంలో కొంత సమయం వేచి ఉండటం ఉత్తమమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. ఇక వైపు బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతికి మద్దతుగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాయి.

రాజకీయంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నా
ఇదే సమయంలో ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన హైకోర్టులోనే రివ్యూ వేయాలా.. లేక సుప్రీంకు వెళ్లాలా అనే అంశం పైన ఆలోచన చేస్తుందంటూ ఏజీ చెప్పటంతో మరోసార అమరావతి వ్యవహారం పైన చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి అమరావతి రైతులు మరో పాదయాత్ర కు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం న్యాయ పరంగా ఎలా ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం న్యాయ పరంగా ముందుకే వెళ్తుందా.. లేక వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications