Amaravati: రాజధాని రైతులకు బంపర్ ఆఫర్స్- సీఆర్డీయే కీలక నిర్ణయాలు..!
అమరావతి రాజధానిలో (Amaravati Capitall) భూసమీరణను (Land pooling) వేగవంతం చేయాలని ఇవాళ సమావేశమైన రాజధాని ప్రాధికార సంస్థ (APCRDA) అథారిటీ భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం గతంలో భూములిచ్చిన వారితో పాటు ఇప్పుడు రెండో దశలో భూములిస్తున్న రైతులకూ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. వీటితో పాటు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, శాకమూరులో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ,కన్వెన్షన్ సెంటర్ కు రూ.596 కోట్ల కేటాయింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో రూ.1,437 కోట్లతో పెద్ద ఎత్తున మౌళిక వసతుల కల్పన చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికోసం రూ.904 కోట్లకు ఆమోదం తెలపగా తాజాగా మరో రూ.533 కోట్లకు ఆమోదం తెలిపారు. రాజధానిలో మౌళిక వసతుల మాదిరిగానే గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైన్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజి,తాగు నీటి లైన్లు, లైటింగ్ తదితర మౌలిక వసతులను కల్పిస్తారు. 29 గ్రామాల్లో ఎల్పీఎస్ లేఅవుట్లలోని చిన్న రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించాలని తొలుత నిర్ణయించినా..అధ్యయనం తర్వాత బీటీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు.

హోటళ్లు, పాఠశాలలు,ఇతర ప్రాజెక్టులకు ఇప్పటికే భూములు కేటాయించిన ప్రాంతాల్లో పక్కనే కొంతమేర అదనంగా కోరుతున్న వారికోసం కొత్త విధానాన్ని తెస్తున్నారు. త్రీ స్టార్, ఫోర్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు, నేషనల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అదనపు భూమిని కోరితే అమరావతిలోని ప్రస్తుత కనీస ధరపై కనీసం 250 శాతం ధరకు కేటాయించేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. అమరావతిలో ప్రస్తుత కనీస ధర ఎకరాకు రూ.4.1 కోట్లు కాగా, కనీసం ఎకరాకు రూ.10.25 కోట్లకు తగ్గకుండా అదనపు భూమిని కేటాయిస్తారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లోని రైతులకు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. 2026 జనవరి 1 వ తేదీకి ముందు తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుంది.














Click it and Unblock the Notifications