రాజధాని తరలింపు కార్యాచరణ ఫిక్స్ : రేపు బీసీజీ నివేదిక: అసెంబ్లీలో నిర్ణయం..కానీ కోర్టులో..!
మూడు రాజధానులు..అమరావతి నుండి రాజధాని తరలింపు వ్యవహారం పైన ప్రభుత్వ కార్యాచరణ ఫిక్స్ అయింది. ఇదే అంశం పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక అందింది. మరో కమిటీ బీసీజీ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక అందించగా..తుది నివేదిక శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ రెండు నివేదికల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ప్రభుత్వానికి తాము అధ్యయనం చేసి సిఫార్సులు అందిస్తుంది.
ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో బీసీజీ నివేదిక పైన చర్చించనున్నారు. ఇక, ఈ నెల 20 లోగా హైపవర్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి అందే అవకాశం కనిపిస్తోంది. ఇక, జనవరి 26 తరువాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రాజధాని అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశం పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పైన ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. దీని పైన ఈనెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బీజేసీ నివేదిక సిద్దం..ప్రభుత్వం ముందుకు
ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందగా..మరో కమిటీ బీజీసీ నివేదిక సైతం శుక్రవారం ప్రభుత్వానికి అందనుంది. ఇప్పటికే బీసీజీ మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అందులో గ్రీన్ ఫీల్డ్ రాజధాని కంటే బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఉత్తమమని సూచించినట్లు సమాచారం. ఈ రెండు కమిటీలను విలువ లేని కమిటీలుగా విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఈ రెండు కమటీలు ప్రభుత్వాని కి అందించిన నివేదికలపైన ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. రెండు కమిటీల్లో చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి తుది నివేదిక ఈ నెల 20వ తేదీ తరువాత అందించే అవకాశం కనిపిస్తోంది.
రిపబ్లిక్ డే తరువాత అసెంబ్లీ..
బీసీజీ ఇచ్చే నివేదిక పైన ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అయితే హైపవర్ కమిటీ నివేదికకు లోబడి నిర్ణయం ఉండనుంది. ఈ మూడు కమిటీల నివేదికల పైనా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఇదే అంశం పైన ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా..అఖిలపక్షం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.
దీంతో.. అఖిల పక్షం ఏర్పాటు అవసరమా కాదా..అదే విధంగ అమరావతి రైతుల విషయంలో ఏం చేయాలనే దాని పైన ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు పైన అక్కడ భూముల లభ్యత పైన ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రాజధాని పైన అసెంబ్లీలో మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటా మని ప్రభుత్వం చెబుతోంది.
న్యాయపరంగా చిక్కులు..అందుకే
ఇప్పటికే రాజధాని పరిరక్షణ సమితి పేరుతో రైతులు రాజధాని తరలింపు అంశం పైన హైకోర్టును ఆశ్రయించారు. జీఎన్ రావు కమిటీతో పాటుగా బీసీజీ కమిటీ ఏర్పాటు..అదే విధంగా హైపవర్ కమిటీ పైనా వారు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ల పైన కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. అందు కోసమే అసెంబ్లీ సమావేశాన్ని సైతం 26వ తేదీ తరువాత ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కోర్టు ఆ రోజు విచారణకే పరిమితం అవుతుందా..లేక ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా అనే చర్చ సైతం ప్రభుత్వం లో నడుస్తోంది.
దీంతో..ఇటు ప్రభుత్వం రాజధాని తరలింపు కార్యాచరణ..మరో వైపు రైతులు ఆందోళనతో పాటుగా న్యాయ పోరాటం కొనసాగుతుండటంతో..సంక్రాంతి తరువాత రాజధాని తరలింపు అంశంలో పరిణామాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.