'నో పబ్లిసిటీ' అంటోన్న చంద్రబాబు! : ప్రచారానికి దూరంగా కృష్ణా పుష్కరాలు
హైదరాబాద్ : గత గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలు.. మరోవైపు పూర్తికాని పనులు.. దీంతో గతేడాది పుష్కరాల్లో కనిపించిన ప్రచార ఆర్భాటం తాజా కృష్ణా పుష్కరాల్లో కనిపించడంలేదు. విషయమేదైనా ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సీఎం చంద్రబాబు కూడా ఈ దఫా ప్రచారంపై అంతగా ఫోకస్ చేయట్లేదని తెలుస్తోంది.
సరిగ్గా ఇంకో 25 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ఇంతవరకూ ఏ ఒక్క ఘాట్ లొ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరగలేదు. పనులు ఆలస్యంగా ప్రారంభమవడం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఘాట్ ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీంతో పుష్కరాల సమయానికి భక్తులకు ఏ మేర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అదీగాక, గత గోదావరి పుష్కరాల సమయంలో ప్రభుత్వం నిర్వహించిన భారీ ప్రచారానికి, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. అన్ని ఏర్పాట్లు సక్రమంగానే చేసినా అపశృతి చోటు చేసుకోవడం జరిగిపోయాయి. దీంతో గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఇంకా పనులు కూడా పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ప్రచారానికి దూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తే.. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, జనం తాకిడి ఎక్కువైతే.. అసలే అరకొర వసతులతో ఉన్న ఘాట్ లు ఏమాత్రం సురక్షితం అనే సందేహం కూడా తలెత్తుతుండడంతో ఎప్పుడూ ప్రచారంలో ఫస్ట్ ఉండే చంద్రబాబు కూడా ఈసారికి ప్రచార ఆర్బాటాలను పక్కనబెట్టారన్న చర్చ జరుగుతోంది.