ప్రజా ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికి ఆరోగ్య పట్టిక: చంద్రబాబు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడి కి సంబంధించి ఆరోగ్య పట్టిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.
అమరావతి: ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయం ప్రారంభం కానుందా? అంటే అవునంటున్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర పౌరులందరికి ఆరోగ్య పట్టికను తయారు చేయించాలని నిర్ణయించినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు లో భాగంగా 13 జిల్లాల హెల్త్ సర్వీస్ ప్రొవైడర్ల సేవలను సిఎం చంద్రబాబు సమీక్షించారు.
ఈ సందర్భంగానే ఆయన ప్రతి పౌరుడి ఆరోగ్యం పట్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలనేది తన అభిమతమని అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా సరి కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు.

ప్రతి ఒక్కరికి ఆరోగ్యపట్టిక
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పట్టిక తయారుచేయాలని వైద్య ఆరోగ్య శాఖను సిఎం ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రతి మూడు నెలలకొకసారి తనకు నివేదికలివ్వాలని సూచించారు.

వారసత్వ రోగాలు త్వరగా గుర్తించేందుకు
ఈ హెల్త్ ప్రొఫైల్స్ వల్ల వారసత్వ రోగాలను త్వరగా గుర్తించడానికి, వారి ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఏర్పడటానికి వీలవుతుందని, అందువల్ల ఈ ఆరోగ్య పట్టికల తయారీలో అన్ని శాఖలు ఏక తాటిపై నడిచి తన ఆలోచనను సాకారం చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈవిధంగా సిద్దం చేసిన హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేసి భద్రపరచాలని హెచ్చరించారు. ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్య పట్టిక తయారు చేయడం లాంటి ప్రయోగం భారతదేశంలో ఎక్కడ జరగలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

అందరి వివరాలు..అన్ని వివరాలు
తాను అనుకున్న విధంగా ప్రజా ఆరోగ్య పట్టిక తయారైతే ప్రతిపౌరుడి ఆరోగ్యం, అనారోగ్య వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయని అన్నారు. దీనివల్ల వారికి వైద్యం చేయించడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సులభమవుంది. ఇది ఆరోగ్య చరిత్రలో నూతనాధ్యాయం కావాలని సిఎం ఆకాక్షించారు. వైద్య సేవలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెంచాలనేదే తన అభిమతమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సిఎం హెచ్చరికలు
ఈ సందర్భంగా హెల్త్ సర్వీస్ ప్రొవైడర్ల పై ముఖ్యమంత్రి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేసినా ఉపేక్షించనని, మంచిగా సేవలు సమకూరిస్తే మరింత ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లలో మార్పుతేవడానికి చైతన్యవంతంగా పనిచేయాలని కోరారు.












Click it and Unblock the Notifications