అమ్మఒడికి నిధులు..కొర్రీలు: సంక్షేమ శాఖల నుండి: వర్గాల వారీగా.. మైలేజ్ దక్కేలా..!
ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడికి ప్రభుత్వం నిధుల సమీకరణ ప్రారంభించింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి జగన్ చిత్తూరులో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ పధకంలో కొర్రీలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఆర్దికంగా ఇబ్బందులు ఉన్నా..ముందుగా జీతాలు..పెన్షన్ల చెల్లింపు తరువాత మిగిలిన వాటికి నిధుల కేటాయింపు నిలుపు దల చేసి.. అమ్మఒడికి కేటాయిస్తున్నారు. ఇదే సమయంలో ఏయే వర్గాల నుండి ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో ప్రచారం చేసుకునేందుకే ఈ విధానం అమలు చేస్తన్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ పధకం కింద తొలి ఏడాది రూ 6,455 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
అమ్మఒడికి నిధులు..అమల్లో కొర్రీలు
అమ్మఒడి పథకం అమలు కోసం విద్యాశాఖ బడ్జెట్లో రూ.6,455 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. లబ్ధిదారులకు మాత్రం సంక్షేమ శాఖల ద్వారా చెల్లింపులు చేయనుంది. దీనికోసం ఆయా శాఖలకు అదన పు బడ్జెట్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి లబ్ధిదారు ల ఖాతాలకు నగదు బదిలీ విధానంలో నిధులు విడుదల చేయనున్నారు. ట్రెజరీ నియంత్రణ.. త్రైమాసిక నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను సడలిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ నిధులకు ఆమోదం పొందేలా జీఓలు జారీ చేశారు.
ఇదే సమయంలో ఈ పధకం కోసం ఆర్దికంగా ఇక్కట్లు ఉండటంతో..ఇతర చెల్లింపులను తాత్కా లికంగా నిలుపుదల చేస్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక, ముందు నుండి చెబుతన్న దానికి భిన్నంగా విద్యార్ధి హాజరు.. విద్యుత్ బిల్లు..ఇతరత్రా కారణాలతో కొర్రీలు వేస్తున్నారు. దీంతో..అనేక మంది ఈ పధకంలో తిరస్కరణకు గురవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వర్గాల వారీగా..మైలేజ్ దక్కేలా..
అమ్మఒడి పధకం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పలు శాఖల్లో బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇచ్చినా... ట్రెజరీ నియంత్రణ పెట్టి నిధులు విడుదల చేయడం లేదు. ఇప్పుడు అమ్మఒడికి మాత్రం వీటిద్వారా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏయే కులాలకు చెందిన ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో ప్రచారం చేసుకునేందుకే ఈ తరహాలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు రూ. 145 కోట్లు కేటాయింపులు చేయడం ద్వారా 9,679 మందికి చెల్లిస్తారు.
ఏపీ మైనారిటీ కార్పొరేషన్కు రూ.428 కోట్లతో 2,85,49 5మంది ముస్లింలకు, బీసీ కార్పొరేషన్కు రూ.3,432కోట్లు కేటాయించడం ద్వారా 3,80,168మంది ఈబీసీలు, 19,07,836మంది బీసీలకు చెల్లించనున్నారు. కాపు కార్పొరేషన్కు రూ.568కోట్లు కేటాయించి దానినుంచి 3,79,033 మందికి చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ ఎస్సీ కార్పొరేషన్కు రూ.1,271 కోట్లు, ఏపీ ఎస్టీ కార్పొరేషన్కు రూ.395 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, ఇప్పుడు ఈ పధకం కోసం దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటటం..మరో వైపు కొర్రీల పేరుతో పక్కన పెడుతుండటం పైన విమర్శలు మొదలయ్యాయి.