ఏపీలో కరోనా భయంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ బంద్... రోగుల గగ్గోలు- సర్కార్ సీరియస్...
ఏపీలో కరోనా భయాల నేపథ్యంలో ఓపీ సేవలకు దూరంగా ఉంటున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం సీరియస్ అయింది. తక్షణం తగిన జాగ్రత్తలు తీసుకుని ఓపీ సేవలను ప్రారంభించాలని వైద్యారోగ్య మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. ఓపీ సేవలపై రోగుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా భయాలతో ఓపీ సేవలు బంద్..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభం కాగానే ప్రభుత్వాలు అప్రమత్తమై లాక్ డౌన్ ప్రకటించాయి. జనం రోడ్లపైకి వచ్చే అవకాశం లేకపోవడం, పోలీసులు, అధికారులు విధిస్తున్న ఆంక్షలతో రోగులు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆస్పత్రులకు వెళ్లలేక ఇంటి వద్దే ఉంటూ నరకం చవి చూస్తున్నారు. దీంతో సహజంగానే ఆస్పత్రులు కూడా జనం లేక, సిబ్బందిని రప్పించలేక ఓపీ సేవలను రద్దు చేసుకున్నాయి. నిత్యం ఓపీ సేవలపైనే లక్షలాది రూపాయలు ఆర్జించే ఆస్పత్రులకు కరోనా భయాలతో వాటిని రద్దు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
రోగుల గగ్గోలు- ఫిర్యాదుల వెల్లువ...
కరోనా వైరస్ వ్యాప్తి భయాలతో లాక్ డౌన్ విధించినా అత్యవసర కేసులను ప్రభుత్వం అనుమతిస్తోంది. ప్రతీ చిన్నా చితకా సమస్యకూ రోడ్లపైకి రావొద్దంటూ మాత్రమే ఆంక్షలు విధించింది. అయితే క్షేత్రస్దాయిలో పనిచేస్తున్న పోలీసులు, ఇతర సిబ్బందికి సమస్య తీవ్రత తెలియకపోవడంతో వారు రోగులను ఆస్పత్రులకు సైతం వెళ్లనీయడం లేదు. దీంతో రోగులు బాధతోనే ఇళ్లకు వెనుదిరగాల్సిన పరిస్దితి. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక, రోడ్లపైకి వెళ్లే పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న రోగులు.. ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. నిత్యం వేల సంఖ్యలో ఈ ఫిర్యాదులు రావడం ప్రభుత్వానికి సైతం తలనొప్పిగా మారింది.
Recommended Video
ప్రభుత్వం సీరియస్- ఆస్పత్రులకు ఆదేశం...
ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చేశాక ప్రైవేటు ఆస్పత్రులకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం కూడా ఓపీ సేవలు కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతోంది. ఓపీ సేవల కోసం వెళ్లే వారిని అనుమతించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రైవేటు ఆస్పత్రులు తగినంత మంది రోగులు లేరనే కారణంతో పాటు మరికొన్ని ఇతర కారణాలతో ఓపీ సేవలు మొదలుపెట్టడం లేదు. దీంతో ప్రభుత్వం మరోసారి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఓపీ సేవలు ప్రారంభించి తీరాల్సిందేనని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారు.