వలస కూలీలు తప్ప ఎవరూ రావొద్దు- తేల్చిచెప్పిన ఏపీ సర్కార్ - అర్ధం చేసుకోమన్న జగన్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి వలస కూలీలకు సడలింపు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వలస కూలీలకు అనుమతిపై ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వలస కూలీలకు తప్ప మిగిలిన వారికి ఎలాంటి అనుమతులు లేవని జగన్ స్పష్టం చేశారు. కాబట్టి మిగతా వారంతా లాక్ డౌన్ ముగిసేవరకూ తాము ఎక్కడుంటే అక్కడే ఉండిపోవాలని సూచించారు.
Recommended Video
కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం మినహాయింపులు ప్రకటించిన నేపథ్యంలో వలస కూలీలతో కలిసి మిగతా వారు కూడా రాష్ట్రాల సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో ప్రభుత్వం స్పందించింది. అనవసరంగా సరిహద్దుల వరకూ వచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సీఎం జగన్ వారికి సూచించారు.
మినహాయింపుల నేపథ్యంలో ఏపీలోకి వస్తున్న వలస కార్మికులను సైతం క్వారంటైన్ కు పంపాల్సి ఉంటుందని, వీరితో పాటు వచ్చే మిగిలిన వారికి ప్రస్తుతం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని జగన్ తెలిపారు. కాబట్టి వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు వీలుగా మిగిలిన వారంతా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇతర రాష్ట్ర్రాల నుంచి ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.