ఏపీ విద్యార్ధులకు ఫిబ్రవరి 17న ఆ ట్యాబ్లెట్స్- ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్ధులకు ప్రభుత్వం (ap govt) ఫిబ్రవరి 17న ఆల్పెండజోల్ మాత్రల్ని అందించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానం ప్రకారం ఈ మాత్రల్ని స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అందించబోతున్నారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు అందాయి. వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం'జరగనుంది. ఇందులో వారికి ఈ ట్యాబ్లెట్స్ ఇస్తారు.
ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న రాష్ట్రంలోని 1,11,63,762 మందికి అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలు రాష్ట్రంలో 23,09,699 మంది ఉన్నారని ఆయన తెలిపారు. మిగిలిన వారు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. కొందరు బడి బయట ఉన్నారన్నారు. వీరందరికీ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమ, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహించబోతున్నామన్నారు.

మట్టి ద్వారా వ్యాపించే నులి పురుగులవల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల లోపం, కడుపు నొప్పి, బలహీనతకు నులిపురుగులు దోహదం చేస్తున్నాయని ఆయన తెలిపారు. వీటివల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారరు. ఓ అంచనా ప్రకారం రాష్టంలో నులిపురుగుల వ్యాప్తి 34% వరకు ఉందన్నారు. ఇది ప్రజారోగ్య సమస్యగా మారుతోందన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు వాడడంద్వారా రక్తహీనత అదుపులోనికి వస్తోందని, ఇతర ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications