త్వరలో ఏపీలో బంపర్ లాటరీ స్కీమ్-ధరలపై సాగుతున్న కసరత్తు- ఖరారు కాగానే ప్రకటన
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పీకల్లోతు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ సర్కార్ ఆదాయ పెంపు మార్గాలపై తీవ్రంగా అన్వేషణ చేస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న ప్రతీ ఒక్క అవకాశాన్ని వినియోగించుకోబోతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన లక్కీ లాటరీ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అతి త్వరలో దీనిపై ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
త్వరలో ఏపీ లక్కీ లాటరీ..
అవిభజిత ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో కొనసాగిన ప్రభుత్వ బంపర్ లాటరీ పథకం మరోసారి విభజిత రాష్ట్రాన్ని ఆదుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ద్వారా పేదలు లాటరీ తగులుతుందన్న అత్యాశతో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకకుంటున్నారని భావించిన సర్కారు ఆదాయం కోల్పోయి మరీ ఈ పథకాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పటికీ కేరళ సహా చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉంది. దీంతో ఏపీలోనూ దీన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
లాటరీ ధరలతోనే సమస్య....
లక్కీ లాటరీ పథకం ప్రవేశపెట్టడం విషయంలో ఎలాగో విపక్షాలు, సాధారణ ప్రజల నుంచి మిశ్రమ స్పందన తప్పదని భావిస్తున్న ప్రభుత్వం.. ధరలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ద్వారా సాధ్యమైనంతగా విమర్శలు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గతంలో లాటరీ టికెట్ కనీస ధర 10 రూపాయలు కూడా ఉండేది. కానీ ఇప్పుడు మారిన పరిస్దితుల్లో దాన్ని 50 లేదా 100 రూపాయలు చేస్తే ఎలా ఉంటుందనేది ఓ ఆలోచన. అలాగే లాటరీ బహుమతి విలువ కూడా కీలకం కానుంది. భారీ బహుమతి ఉంటే తప్ప లాటరీ టికెట్లను ఊరికే కొని డబ్బులు పోగొట్టుకునేందుకు ఎవరూ సిద్దంగా ఉండరు. కాబట్టి బహుమతి విలువపైనా అధికారులు చర్చిస్తున్నారు.
లాటరీపై మద్యం ధరల ప్రభావం...
సాధారణంగా లాటరీ టికెట్లు కొనేది మధ్యతరగతి లేదా దిగువ మధ్య తరగతి వారే. అంటే వీరికి అందుబాటులో ధరలు ఉంచాల్సిందే. లేకపోతే వీటికి స్పందన ఉండదు. అసలే ఇప్పుడు ఈ కేటగిరీలో ఉన్న వారిలో చాలా మంది మద్యం కోసం ఎగబడుతున్నారు. ప్రభుత్వం వీటి ధరలు కూడా భారీగా పెంచింది. దీంతో లాటరీ, మద్యం రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్ధితి పేదలకు ఎదురుకావచ్చు. దీంతో మద్యం ధరలు కూడా లాటరీ ధరల నిర్ణయంలో కీలకం కావచ్చని భావిస్తున్నారు.
ఆన్ లైన్ కొనుగోళ్లు....
గతంలో లక్కీ లాటరీ టికెట్లు కొనాలంటే ప్రభుత్వం నియమించిన ఆధీకృత ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. ప్రతీదీ ఆన్ లైన్ అయిపోయింది. కాబట్టి లాటరీ టికెట్లను సైతం ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజలు కరోనా భయాలు లేకుండా నేరుగా వెబ్ సైట్లోనే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. బహుమతి వివరాలను కూడా ఎస్మెమ్మెస్ లు, మెయిల్స్ ద్వారా కస్టమర్ కు పంపనున్నారు.
Recommended Video
ధరలు, బహుమతి నిర్ణయమైతే ప్రకటన...
ప్రస్తుతం లాటరీ ధరలు, బహుమతి విలువపై ఇతర రాష్ట్రాల్లో పరిస్దితులను అధ్యయనం చేస్తున్న అధికారులు ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నారు. ఓసారి నివేదిక అందగానే ప్రభుత్వం లాటరీ పథకం పునరుద్ధరణపై ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ తో పాటు బహిరంగ మార్కెట్లో ఏజెంట్ల ద్వారా పరిమితంగానే ప్రారంభించి ఆ తర్వాత దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయి.