ఓ అడుగు వెనక్కి వేసిన సర్కార్: నిమ్మగడ్డ తీర్పుపై స్టే పిటీషన్ ఉపసంహరణ: కేంద్రం జోక్యమా?
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. సై అంటే సై అనేలా సాగిన న్యాయపరమైన పోరులో జగన్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ దాఖలు చేసిన స్టే పిటీషన్ను సోమవారం ఉపసంహరించుకుంది.
ఇదే అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసిన మరుసటి రోజే ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రమేష్ కుమార్ను ఎన్నికల కమిషనర్గా పునర్నిమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అక్కడ ఈ పిటీషన్ అడ్మిట్ కావడం వల్లే హైకోర్టులో వేసిన స్టే పిటీషన్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకే అంశంపై ఒకే పార్టీ రెండు వేర్వేరు న్యాయస్థానాల్లో పిటీషన్లను దాఖలు చేయడం సరికాదనే అభిప్రాయానికి రావడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. తొలుత- ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ను సుప్రీంకోర్టు ఎక్కడ విచారణకు స్వీకరించదో అనే అనుమానంతో ముందుజాగ్రత్త చర్యగా హైకోర్టులో స్టే పిటీషన్ వేశారని అంటున్నారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటీషన్ను విచారణకు స్వీకరించడంతో ఇక హైకోర్టు నుంచి దీన్ని వెనక్కి తీసుకుందని సమాచారం.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందనే వాదనలు కూడా లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టే పిటీషన్ను వెనక్కి తీసుకుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. ఒకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాత.. అదే అంశంపై మళ్లీ హైకోర్టులో విచారణ చేపట్టడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడటానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైకోర్టులో పిటీషన్ విచారణలో ఉన్నందున సుప్రీంకోర్టు దాన్ని మళ్లీ తిప్పిపంపవచ్చని తెలుస్తోంది.
అదే జరిగితే ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడిందని, ఆ ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికే ఏపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ అడ్మిట్ అయిన వెంటనే ఏపీ హైకోర్టు నుంచి స్టే పిటీషన్ను ఉపసంహరించిందని అంటున్నారు. కాగా- నిమ్మగడ్డ వ్యవహారంపై దాఖలు చేసిన పిటీషన్ త్వరలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం సమక్షానికి రానుంది.