మూడు రాజధానుల పిటీషన్లపై ఏపీ హైకోర్టు: స్టేటస్ రిపోర్ట్..కౌంటర్ దాఖలుకు గడువు
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లు.. ఇవ్వాళ మరోసారి ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఇప్పటివరకు అమరావతి ప్రాంత పరిధిలో చోటు చేసుకున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్ట్ను ప్రభుత్వ తరఫు న్యాయవాది సమర్పించారు. వీటిని పరిశీలించిన అనంతరం బెంచ్ తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.
రాజధాని పిటిషన్లు ఇవ్వాళ విచారణకు వచ్చాయి. ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ దాఖలైన పిటీషన్లు అవి. ఈ విషయంలో ప్రభుత్వం కోర్టు ధిక్కారణకు సైతం పాల్పడిందనేది పిటీషన్ల ఆరోపణ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సారథ్యంలో జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్ రాయ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్లను విచారించింది.
రాజధాని పనుల పురోగతి, నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందజేయాలంటూ హైకోర్టు ఇదివరకే ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూ సమీకరణ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పనిసరిగా పాటిస్తోన్నారా? లేదా అనే విషయాన్ని నివేదికలతో సహా అందజేయాలంటూ సూచించింది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి హైకోర్టు ఇదివరకు ప్రభుత్వానికి పలు గడువులు ఇచ్చింది.
రాజధానిలో పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు స్థలాలు అప్పగించాల్సి ఉంటుంది. రాజధాని నగర నిర్మాణం, సీఆర్డీఏ ప్రాంత అభివృద్ధిని ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ డెడ్లైన్ విధిస్తూ ఈ ఏడాది మార్చిలో ఆదేశాలను జారీ చేసింది. ఈ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఇవ్వాళ ఈ పిటీషన్లను మరోసారి హైకోర్టు ధర్మాసనం విచారించింది.
ప్రభుత్వం తాజాగా సమర్పించిన నివేదికతో పాటు ప్రతివాదుల తరఫు నుంచి అందిన పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించింది. ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలంటూ పిటీషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కౌటర్ దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.