టీటీడీ సభ్యులుగా నేరచరితులా?: ఏపీ హైకోర్టు ఆగ్రహం, జగన్ సర్కారుపై బీజేపీ నేత భానుప్రకాశ్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడాన్ని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి.. హైకోర్టులో సవాల్ చేశారు. గురువారం హైకోర్టు విచారణ జరిపింది.
టీటీడీ బోర్లు నేరచరితులను ఎలా నియమిస్తారు?
ఈ సందర్భంగా నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అంతేగా, మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వేయిదా వేసింది.
జగన్ సర్కారుకు ప్రజలే షాకిస్తారు: భాను ప్రకాశ్ రెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ధ్వజమెత్తారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన చురకలంటించారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
అంధకార ప్రదేశ్గా మార్చారంటూ భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్
ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ ఏపీ భానుప్రకాష్రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే ఒక్క ఛాన్సు అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి సీఎం జగన్ బయటకు రావాలన్నారు. వారం రోజుల పాటు సీఎం జగన్ బయటకు వచ్చి ప్రజలతో కలిసి గుడిసెల మధ్య నివసించాలని సవాల్ చేశారు. సామాన్యుల మధ్య జీవిస్తే ప్రజల కష్టాలేంటో సీఎం జగన్కు తెలుస్తాయన్నారు భాను ప్రకాశ్ రెడ్డి.