ఏపీలో రాష్ట్రపతి పాలన- హైకోర్టులో ప్రభుత్వం ఆందోళన- రాజ్యాంగ విచ్ఛిన్నం కేసులో
ఏపీలో వ్యక్తుల అదృశ్యం సందర్భంగా దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో పోలీసు శాఖ నిర్లిప్త ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, అనంతరం అధికార పార్టీ నేతలు హైకోర్టుపై సోషల్ మీడియాలో సాగించిన వార్ ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని అత్యున్నత న్యాయస్ధానం ఓ అంచనాకు వచ్చింది. ఇదే కేసులో వాదనల సందర్భంగా రాజ్యాంగ విచ్ఛిన్నం అనే పదం వాడొద్దని ప్రభుత్వం కోరినా హైకోర్టు ధర్మాసనం వెనక్కి తగ్గలేదు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందంటూ పోలీసుల తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా విచారణ కొనసాగుతుందని హైకోర్టు ప్రకటించింది.
ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం ఎందుకంటే..
ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిన వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టు గతంలోనే నిర్ణయించింది. దీని వెనుక ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. ఇందులో ప్రధాన మైనది ఏపీలో వ్యక్తుల అృదృశ్యం సందర్భంగా దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు. వీటి విచారణ సందర్భంగా డీజీపీ హైకోర్టు హాజరై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా వ్యక్తుల అదృశ్యం కానీ హెబియస్ కార్పస్ పిటిషన్ల దాఖలు కానీ ఆగలేదు. అదే సమయంలో ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్న బాధితుల తరఫు లాయర్లను పోలీసులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. అదే సమయంలో హైకోర్టు పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు. దీంతో ఈ రెండు వ్యవహారాలను కలిపి విచారించి రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అయిందో లేదో తేల్చాలని హైకోర్టు నిర్ణయించింది.
సర్కారు విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు
రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. అక్టోబర్ నుంచి విచారణ జరుగుతుంటే ఇప్పటివరకూ మౌనంగా ఉండి చివరి నిమిషంలో విచారణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించింది. విచారణ ఆలస్యం చేసేందుకే ఇలాంటి విజ్ఞప్తి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, అప్పటివరకూ వాయిదా వేయాలని కోరినా హైకోర్టు ఆంగీకరించలేదు. దీంతో హైకోర్టులో తీవ్ర వాడీవేడిగా వాదనలు సాగాయి.
రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందని ఆందోళన
ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ విచ్ఛిన్నంపై విచారణ చేస్తామంటూ హైకోర్టు ముందుకెళ్లడంపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చివరికి పోలీసుల తరఫు న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ తన వాదనల్లో రాజ్యాంగ వ్యవస్దలు విఫలమైనట్లు తేల్చడమంటే ఆర్టికల్ 356 ప్రకారం రాష్టపతి పాలనకు దారి తీయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ధర్మాసనం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ఓ న్యాయవాది మునుపెన్నడూ లేని విధంగా హైకోర్టులో రాష్ట్రపతి పాలన ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు ఈ కేసు విచారణలో ఇచ్చే ఉత్తర్వులు అంతిమంగా రాష్ట్రపతి పాలనకు దారి తీస్తాయని ప్రభుత్వంలో ఆందోళన నెలకొన్నట్లు సూచిస్తున్నాయి.
Recommended Video
ఏజీ వర్సెస్ ధర్మాసనం మాటకు మాట
రాజ్యాంగ విచ్ఛిన్నం కేసు విచారణకు సంబంధించి జరిగిన వాదనల్లో అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం తీరును జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేయాలని, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ నుంచి ఇలాంటి వాదనలు ఊహించలేదంటూ ధర్మాసనం వ్యాఖ్యానించగా.. మీ నుంచి కూడా ఇలాంటి వాదనలు ఊహించలేదంటూ ఏజీ శ్రీరాం సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి వ్యవస్ధలు ముఖ్యమని ఏజీని హెచ్చరించింది.