ఏపీ హైకోర్టు సంచలనం: 28 వరకూ విచారణలన్నీ రద్దు: విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు కూడా..
అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని కీలకమైన పిటీషన్లపై విచారణ చేపట్టాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. హైకోర్టు కార్యకలాపాలకు అనూహ్యంగా మూడురోజుల పాటు బ్రేక్ పడింది. ఆదివారం వరకూ హైకోర్టుకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు రద్దు అయ్యాయి. ఈ మూడు రోజుల పాటు హైకోర్టు సమావేశం కాబోదు. ఎలాంటి పిటీషన్ల పైనా విచారణ ఉండబోవు.
ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (నియామకాలు) ఓ ప్రకటన జారీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తుల యూనిట్కు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ విజయవాడ మెట్రోపాలిటన్ న్యాయస్థానం కూడా ఎలాంటి కార్యకాలాపాలను చేపట్టబోదని రిజిస్ట్రార్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ వారం కొన్ని కీలక పిటీషన్లు హైకోర్టు సమక్షానికి విచారణకు వస్తాయని భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకలాపాలు రద్దయ్యాయి.
ఉద్వాసనకు గురైన రాష్ట్ర ఎన్నికల నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ, ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు, ప్రైవేటు బస్సుల ఫోర్జరీ కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి బెయిల్ పిటీషన్ల వంటివి ఈ వారమే విచారణకు వస్తాయని భావిస్తున్నారు.

హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేయడానికి ప్రధాన కారణం.. కరోనా వైరస్. విజయవాడలో వందల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడురోజుల పాటు ఉద్యోగులు, సిబ్బందికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఏపీ హైకోర్టు, విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో పనిచేసే ప్రతి ఉద్యోగి, అన్ని స్థాయిల్లోని సిబ్బందికి ప్రత్యేకంగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించనున్నారు. అందుకే- ఈ రెండు న్యాయస్థానాల కార్యకలాపాలను రద్దు చేయాల్సి వచ్చిందని రిజిస్ట్రార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications