రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు .. ఇప్పుడు జోక్యం చేసుకోలేం అంటూ
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించేందుకు ఎపీలోని వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ అధికారికంగా ప్రకటన గానీ, అధికారిక ఉత్తర్వులు కానీ వెలువడలేదు. అయితే సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారంలో రాజధాని అమరావతి విషయంలో వేసిన కమిటీలపైన ఇప్పటికే ఏపీ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇక రాజధాని విషయంలో హైకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని వేసిన పిటీషన్ విషయంలో రాష్ట్ర హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు ఎందుకీ పిటీషన్లు అని ప్రశ్నించిన హైకోర్టు
ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు ఆ అంశంలో తాము ఎలా జ్యోకం చేసుకోగలమని హైకోర్టు పిటీషన్ దారుడిని ప్రశ్నించింది. అంతే కాదు ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాక ముందు తరలింపును సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్స్ అన్ని కూడా పనికిరాని అపరిపక్వమైనవే అవుతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది .
తరలింపుపై అత్యవసర విచారణ కోరుతూ న్యాయవాది పిటీషన్
రాజధాని అంశంపై తక్షణమే హైకోర్ట్ జ్యోకం చేసుకోవాలని గుంటూరుకి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు బుధవారం సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి న్యాయమూర్తి జస్టిస్ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు తన వాదన వినిపించారు.
రాజధాని తరలింపు ఒక్కరోజులో అయ్యే పని కాదన్న ధర్మాసనం
ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అసలు రాజధానిపై అధికారిక ప్రకటన రాకుండానే ఇలాంటి పిటీషన్లు దాఖలు చెయ్యటం వ్యర్థం అని పేర్కొంది. తరలింపు అనేది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఒకవేళ అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవుల తరువాత పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావుకు స్పష్టం చేసింది హైకోర్టు .