ఏపీలో కరోనా చికిత్స- జగన్ సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కానీ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కానీ కోవిడ్ రోగులకు సరైన వైద్యం అందడం లేదు. దీనిపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యం విచారించిన హైకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలో కోవిడ్ చికిత్సలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇవాళ జారీ చేసిన ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏపీలో కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. వీటిలో కోవిడ్ చికిత్సపై పలు సూచనలు కూడా చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రులకు నోడల్ అధికారుల్ని నియమించాలని, ఆస్పత్రుల్లోనే వారి ఫోన్ నంబర్లను అందరికీ కనిపించేలా ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
ప్రభుత్వం కోవిడ్ చికిత్స కోసం ప్రకటించిన ఫీజులను, పడకల సంఖ్యను కూడా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఫ్లయింగ్ స్వాడ్ టీమ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్, అత్యవసర మందులు, ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు అమలవుతున్నాయా లేదా పరిశీలించాలని సూచించింది. వీటిపై విజిలెన్స్ నివేదికను రోజువారీ అందజేయాలని ఆదేశించింది. కోవిడ్ పరీక్షల ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కూడా హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.