ఏపీ హైకోర్టు జడ్డీలపై సోషల్ పోస్టుల కేసులో మరో ట్విస్ట్- ఇరుక్కున్న ట్విట్టర్, యూట్యూబ్
ఏపీ హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ దీనిపై సాగుతున్న దర్యాప్తులో సీబీఐ ముందడుగు వేయలేకపోతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
హైకోర్టు జడ్డీలపై దూషణలు చేస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ పలువురు వైసీపీ సానుభూతిపరుల్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ఈ వ్యవహారాన్ని వేగంగా తేల్చడంలో సీబీఐ విఫలం కావడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో జోక్యంచేసుకున్న ఏపీ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారితో బేషరతు క్షమాపణలు చెప్పించేందుకు సిద్ధమైంది. దీనిపై పత్రికాముఖంగా నోటీసులు కూడా జారీ చేస్తామని హైకోర్టుకు తెలిపింది.
అదే సమయంలో జడ్డీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో పూర్తి వివరాల కోసం సామాజిక మాధ్యమ సంస్ధలైన యూట్యూబ్, ట్విట్టర్ లను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు ఈ వివరాలు తెలిపారు. దీనికి హైకోర్టు ధర్మాసనం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్ధలకు సీబీఐ నోటీసులు జారీ చేస్తోంది. జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెట్టారు. తాము కేసు విచారణ చేపట్టిన తర్వాత కూడా పోస్టులు పెట్టిన వ్యవహారంపైనా సీరియస్ గా దృష్టిపెడుతోంది.
ఇదే కేసులో విదేశాల్లో ఉంటున్న వైసీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ వివరాలు తెప్పించే విషయంలో సీబీఐ చేతులెత్తేయడంతో హైకోర్టు రిజిస్టార్ జనరల్ జోక్యం చేసుకుని వివరాలు తెప్పించి హైకోర్టుకు అందించారు. దీంతో పంచ్ ప్రభాకర్ వ్యవహారంలో సీబీఐ వైఫల్యంతో పాటు ఇతర అంశాలపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది.