ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్- సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్
ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికలను నిలిపేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో రేపు ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్కు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఎస్ఈసీ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంతో ఎన్నికలు యథావిథిగా ఎన్నికలు జరగబోతున్నాయి.
ఏలూరు కార్పోరేషన్ పరిధిలో జరిగిన డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గతేడాది మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడకముందే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. అప్పట్లోనే ఓటర్ల జాబితాలో తప్పులు సవరించకుండా ఎన్నికలు నిర్పహించవద్దని ఆదేశాలు ఇచ్చింది. అయితే స్ధానిక మున్సిపల్ కమిషనర్ ఓటర్ల జాబితాలో హడావిడిగా సవరణలు చేసి ఎస్ఈసీకి పంపడం, దాని ఆధారంగా ఎస్ఈసీ ఈసారి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిపోయింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ అప్పటి పిటిషనర్లు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ నిన్న స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
ఏలూరులో ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికల పోలింగ్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటించడంపై మాత్రం ఆంక్షలు విధించింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఫలితాలు ప్రకటించవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపటి పోలింగ్కు మాత్రం ఇబ్బందులు తొలగిపోయినట్లయింది.