Vallabhaneni Vamsi :వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు-ఏపీ ప్రభుత్వానికీ-కేసు ఇదే..
ఏపీలో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో కొనసాగుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా ఒకరు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వంశీ మోహన్ కు ఇవాళ మరో షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ పై దాఖలైన పిటిషన్ లో హైకోర్టు ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్కు ఇవాళ ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. వల్లభనేని వంశీ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ఓ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... దీనిపై తన స్పందన తెలియజేయలంటూ వంశీకి నోటీసులు జారీ చేసింది. వంశీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది.
Recommended Video
2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేసి గెలిచిన వంశీ...2019 ఎన్నికల్లోనూ అదే పార్టీ తరఫున గన్నవరం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టడంతో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీకి దూరంగా జరిగిన వంశీ వైసీపీకి దగ్గరయ్యారు. అయితే ఇప్పటికీ టీడీపీకి రాజీనామా చేయని వంశీ... రికార్డుల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో వంశీతో పోటీ పడుతున్న రెండు వర్గాలు ఇప్పటికే ఆయన్ను టార్గెట్ చేశాయి. ఇందులో భాగంగానే వంశీపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.