ఏపీ పరిషత్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
అమరావతి: పరిషత్ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆదివారం వాదనలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీనిపై ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా ఆదివారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలింగ్, లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.
చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక నేతలు
పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్న ఆ పార్టీ నేతల సంఖ్య పెరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి చెందిన జడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా వైయస్సార్సీపీలోకి చేరారు. వారికి మంత్రి కొడాలి నాని, కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
ఇది ఇలావుండగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కోరారు. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక నిజాయితీగా జరిగితే టీడీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.