వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ- కేంద్రానికి ఆగస్టు 2 డెడ్ లైన్-హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ పై జరిగిన విచారణలో కౌంటర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల సమయం కోరింది. అయితే కౌంటర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడంపై పిటిషనర్ లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నెల 29న కేంద్రం బిడ్డింగ్ చేపట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
Recommended Video
ఈ నెల 29న వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్గింగ్ నిర్వహిస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అలాంటిదేమీ లేదని హైకోర్టుకు వివరణ ఇచ్చారు.
దీంతో హైకోర్టు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరిస్తూ ఆగస్టు 2 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని డెడ్ లైన్ విధించింది. దీనికి అంగీకరించిన కేంద్రం తరఫు న్యాయవాది.. కౌంటర్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను ఆగస్టు 2 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.