అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక తీర్పు
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్రను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పాదయాత్రలో ఐడీ కార్డులు ఉన్నవారే పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు వెంటనే ఐడీ కార్డులు అందించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రైతులకు సంఘీభావం తెలియజేసేవారు ఏ రూపంలోనైనా తెలపవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలంటూ ధర్మాసనం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం వరకు అమరావతి రైతులు సెప్టెంబరు 12వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనేది వీరి ప్రధాన డిమాండ్. యాత్ర దారిపొడవునా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రామచంద్రాపురం చేరుకున్న తర్వాత కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ఐడీ కార్డులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా వాయిదా పడింది.
దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. పాదయాత్రలో పాల్గొనే రైతులందరికీ వెంటనే ఐడీకార్డులు ఇవ్వాలంటూ పోలీసు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. రామచంద్రాపురంలోని ప్రయివేటు స్థలంలో నిలిపివుంచిన రైతుల దివ్యరథంలో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు దాన్ని కోర్టులో సబ్ మిట్ చేయకపోవడంతో దీనిపై కూడా రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.