పరిషత్ ఓట్ల లెక్కింపుపై అదే ఉత్కంఠ- హైకోర్టు విచారణ అప్డేట్ ఇదే
ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నా ఓట్ల లెక్కింపు మాత్రం జరగలేదు. దీంతో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని పేర్కొంది. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. దీనిపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలపై గతంలో టీడీపీ, జనసేన తరపు దాఖలైన పిటిషన్లపై ఇవాళ సింగిల్ బెంచ్లో మరోసారి విచారణ జరిగింది. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు సింగిల్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. అయితే ప్రభుత్వం, ఎస్ఈసీ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉండటం, అందరి పిటిషనర్ల వాదనలు వినాల్సి ఉండటంతో హైకోర్టు విచారణను వచ్చే సోమవారానికి అంటే ఏప్రిల్ 19వ తేదీకి వాయిదా వేసింది.
వాస్తవానికి ఏపీలో ఏపీ ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో ఎస్ఈసీ నీలం సాహ్నీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని, అందుకే నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా జారీ చేయాలని టీడీపీ నేత వర్లరామయ్య గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలు నిలిపేస్తూ తీర్పు ఇచ్చింది.
దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్.. ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే తదుపరి తీర్పు ఇచ్చే వరకూ ఓట్ల లెక్కింపు జరగకుండా ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వద్ద ప్రాధమిక విచారణ జరిగినందున ఓట్ల లెక్కింపుపైనా ఆయన వద్దకే వెళ్లి తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.