జగన్ సర్కాకుకు న్యాయసలహా కరవు-మేం మీకు వ్యతిరేకం కాదు-హైకోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు....
ఆంధ్రప్రదేశ్ లో ఓ సాధారణ కేసు విషయంలో రాష్ట్ర పోలీసు బాస్ అయిన డీజీపీని హైకోర్టుకు రప్పించాల్సి రావడంపై న్యాయమూర్తి చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఓ విధంగా చూస్తే జగన్ ఏడాది పాలనపై ప్రజల్లో జరుగుతున్న చర్చకు హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు అద్దం పట్టేలా ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకుని కూడా సీఎం జగన్ తగిన సలహాలు తీసుకోలేకపోతున్నారనే అర్ధం ధ్వనించేలా ఈ వ్యాఖ్యలు ఉండటంతో ప్రభుత్వ వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది.
వైఎస్ జగన్ ఏపీకి శాశ్వత సీఎం: రాపాక వరప్రసాదరావు, పూర్తి చంద్రముఖిగా మారారా?
హైకోర్టుకు డీజీపీని రప్పించడం...
అక్రమ మద్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్లలోనే ఉంచుకోవడంపై ప్రభుత్వం నుంచి సరైన కౌంటర్ దాఖలు కాకపోవడంతో నిన్న హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్ ను న్యాయస్ధానానికి పిలిపించింది. అయితే ఈ చిన్న కేసులో డీజీపీని హైకోర్టు ఎందుకి పిలిపించిందన్న చర్చ సాగుతుండగానే.. దీనికి సదరు న్యాయమూర్తి దేవానంద్ కోర్టు హాల్లోనే సమాధానం ఇచ్చేశారు. ఈ చిన్న కేసులో రాష్ట్ర పోలీస్ బాస్ అయిన మిమ్మల్ని కోర్టుకు రప్పించడం తమకూ బాధగానే ఉందని, అయితే ప్రభుత్వం తరఫున హైకోర్టుకు సరైన సమాచారం రానందువల్లే నిజాయితీ, సమర్ధత కలిగిన మిమ్మల్ని కోర్టుకు రప్పించక తప్పలేదన్నారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సరైన సలహా ఇచ్చేవారేరీ...?
జస్టిస్ దేవానంద్ అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి న్యాయ సలహాదారులు సరైన సలహాలు ఇచ్చి సహకరించకపోవడం వల్ల హైకోర్టు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోందన్నారు. దీంతో కొందరు ప్రభుత్వానికి హైకోర్టు వ్యతిరేకం అన్న భావనలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టులున్నది రాజ్యాంగం, న్యాయవ్యవస్ధ పరిరక్షణకే అన్నారు. ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వకుండా కోర్టులను నిందిస్తే ప్రయోజనం ఏముంటుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులోనూ మీకు సరైన న్యాయసలహా ఇవ్వకపోవడం వల్లే మీరు ఇక్కడ నిలబడాల్సి వచ్చిందని డీజీపీ సవాంగ్ ను ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారులు సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్లే ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరు కావాల్సిన పరిస్దితి ఏర్పడుతోందని మరో బాంబు పేల్చారు.
న్యాయమూర్తి వ్యాఖ్యల వెనుక...
గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 కేసుల్లో హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో ప్రభుత్వ వర్గాలతో పాటు ప్రజల్లోనూ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనే భావన కలుగుతోందనే భావన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యల్లో కనిపించింది. ఈ మధ్య హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ చోటు చేసుకుంది. దీనిపై న్యాయవాది లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్ధానం... 94 మందికి నోటీసులు పంపింది. వీరిలో పలువురిపై సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది. తాజాగా జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
Recommended Video
ప్రజల్లో ఉన్నదే న్యాయమూర్తి చెప్పారా ?
గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ జగన్ సర్కారుకు సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడం లేదనే చర్చ సర్వత్రా సాగుతోంది. ముఖ్యంగా న్యాయ, మీడియా విభాగాల్లో జగన్ కు సరైన సలహాదారులే కరువయ్యాయరని, అయినా జగన్ సలహాదారులను నియమించుకున్నా వారి సలహాలు మాత్రం తీసుకోవడం లేదనే చర్చ సాగుతోంది. దీనికి కొనసాగింపుగా హైకోర్టు కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకపోవడమే అని వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మరింత ముదిరే అవకాశముంది. అయితే సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించగా.... విపక్షాలు మాత్రం జగన్ ఎవరి సలహాలైనా వింటేగా అని చెవులు కొరుక్కుంటున్నాయి..