రాజధానులపై మెమో దాఖలు చేయని జగన్ సర్కార్- బిల్లుల రద్దు వివరాలు కోరిన హైకోర్టు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీలో బిల్లుల్ని ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బిల్లుల్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఇదే అంశంపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేయాల్సిన మెమో మాత్రం దాఖలు కాలేదు. దీంతో విచారణ వాయిదా పడింది
ఏపీ హైకోర్టులో ఇవాళ ప్రభుత్వ న్యాయవాదులు.. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో హైకోర్టు విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది రాజధానుల బిల్లుల రద్దుపై పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని హైకోర్టు వారికి సూచించింది. అయితే మధ్యాహ్నానికి కూడా ప్రభుత్వ న్యాయవాదులు మెమో దాఖలు చేయలేకపోయారు. ప్రభుత్వం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బిల్లుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టడంతో దీనిపై లాయర్లు హైకోర్టులో మెమో దాఖలు చేయడానికి వీల్లేకుండా పోయింది.
హైకోర్టు సూచన మేరకు మెమో దాఖలు చేయని ప్రభుత్వ న్యాయవాదులు.. తమకు మరింత గడువు కావాలంటూ కోరారు. దీంతో హైకోర్టు ఈ మేరకు వారికి అవకాశం కల్పించింది. అయితే రాజధాని చట్టాల రద్దుపై పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఉపసంహరించుకున్న బిల్లుల వివరాలతో పాటు పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వ లాయర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆ మేరకు వారికి సమయమిస్తూ మూడు రాజధానుల పిటిషన్లపై రోజువారీ సాగుతున్న విచారణను కాస్తా వచ్చే సోమవారం వరకూ వాయిదా వేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.