వైఎస్ జగన్ సెక్యూరిటీ కేసులో ఇంప్లీడ్ పిటిషన్..! హైకోర్టు చీవాట్లు..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సెక్యూరిటీ తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే మధ్యలో ఈ పిటిషన్ లో భాగస్వామిని అయ్యేందుకు అనుమతించాలంంటూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగస్వామి కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సదరు పిటిషనర్ కు అక్షింతలు వేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న భద్రతను కొనసాగించాలంటూ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తన భద్రత తగ్గించడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఇండియన్ ముస్లింలీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలీ హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది.

తన భద్రతపై నేరుగా జగనే పిటిషన్ దాఖలు చేశాక ఇందులో ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఏముందని హైకోర్టు పిటిషనర్ ఖాజా వలీని ప్రశ్నించింది. కోర్టుల్ని ప్రచార వేదికలుగా, క్రీడా మైదానాలుగా మార్చుకుంటున్నారంటూ పిటిషనర్ ఖాజావలీపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇంప్లీడ్ పిటిషన్ లో వాడిన పదాలపైనా జడ్జీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తదుపరి విచారణలో ఈ వ్యవహారం తేలుస్తామని పిటిషనర్ ను హెచ్చరించారు. అదే సమయంలో జగన్ తరఫు లాయర్ సుమన్ తమ పిటిషన్ లో ఎవరి సాయం అవసరం లేదని కోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications