వైసిపికి మరో ఎమ్మెల్యే : టిడిపి ఎమ్మెల్యే కు షాక్, హైకోర్టు సంచలన తీర్పు..!
ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో..అధికార పార్టీకి షాక్ తగిలింది. కాగా, వైసిపికి మరో ఎమ్మెల్యే పెరిగారు. అనంతపురం జిల్లా మడకశిక టిడిపి ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఏపి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన పై 2014 ఎన్నికల్లో పోటీ చేసిన వైసిపి అభ్యర్ధి డాక్టర్ తిప్పేస్వామి విజయం సాధించినట్లు న్యాయ స్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా హైకోర్టు విచారణ అనంతరం ఈ సంచలన తీర్పు వెలువరించింది.
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది.
ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి రిటర్నరింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు.
తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తిప్పే స్వామి ఇప్పుడు విజయం సాధించి కోర్టు తీర్పు ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. అయితే, దీని పై టిడిపి అధినాయకత్వం..అసెంబ్లీ వర్గాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.