జడ్జి రామకృష్ణకు ప్రాణహాని- హైకోర్టు ఆందోళన-బెయిల్ కంటే కస్టడీయే మేలని సూచన
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్డి రామకృష్ణ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్యలపై రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జడ్డి రామకృష్ణ బెయిల్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం కంటే సేఫ్ కస్టడీలో ఉంచడమే మంచిదని అభిప్రాయపడింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇస్తే ప్రాణహాని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
జడ్డి రామకృష్ణ కేసు
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డితో అమీతుమీతో మొదలైన జడ్డి రామకృష్ణ వ్యవహారం ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేయడంతో మరో మలుపు తిరిగింది. ఇదే క్రమంలో సీఎం జగన్పై రామకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం అభియోగాలు మోపి అరెస్టు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన జడ్డి రామకృష్ణకు అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రామకృష్ణ భద్రతపై స్వయంగా హైకోర్టే ఆందోళన వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జడ్డి రామకృష్ణ ప్రాణాలకు ముప్పు
రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణకు బెయిల్ ఇచ్చేవిషయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. జడ్డి రామకృష్ణ కేసును పరిశీలించిన న్యాయమూర్తి గంగారావు.. బెయిల్పై బయటికొస్తే రామకృష్ణ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని వ్యాఖ్యానించారు. అంతే కాదు పిటిషనర్ ఇదే విధంగా వ్యవహరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో బెయిల్ వ్యవహారం కాస్తా మలుపుతిరిగినట్లయింది.
బెయిల్ కంటే కస్టడీయే బెటర్
ప్రస్తుత పరిస్ధితుల్లో జడ్డి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేయడం కంటే ఆయన సేఫ్ కస్టడీలో ఉండటమే బెటరని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన కొంతకాలం సేఫ్ కస్టడీలో ఉండటమే ఉత్తమమన్నారు. దీంతో బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను, సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి ముందు ఉంచేందుకు జడ్డి రామకృష్ణ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ గడువు కోరారు. దీంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
మీడియాతో మాట్లాడనివ్వొద్దన్న సర్కార్
దాదాపు వైసీపీ ఎంపీ రఘురామరాజు వ్యవహారం తరహాలోనే జడ్డి రామకృష్ణను కూడా మీడియాతో మాట్లాడనివ్వకుండా నిలువరించాలని పబ్లిక్ ప్లాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి హైకోర్టును కోరారు. జడ్డి రామకృష్ణకు బెయిల్ ఇవ్వాల్సి వస్తే ఆయన మీడియాతో మాట్లాడకుండా, టీవీ చర్చల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరారు. బెయిల్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై సుప్రీంకోర్టు తీర్పులు పరిశీలించాక హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది.