స్వరూపానందకు హైకోర్టు షాక్- ఆలయాల్లో పుట్టినరోజు వేడుకల ఉత్తర్వులు రద్దు
ఏపీలోని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందస్వామి పుట్టినరోజు వేడుకల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కాకుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వరూపానందస్వామి పుట్టినరోజు వేడుకలను ఏపీలోని ప్రధాన ఆలయాల్లో నిర్వహించేలా దేవాదాయశాఖ జారీ చేసిన మెమోను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది.
ఈ నెల 18న శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 23 ఆలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయాశాఖ ఆదేశాలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఈ మేరకు స్వరూపానంద పుట్టినరోజు వేడుకల్లో మర్యాదలు కావాలంటూ ప్రభుత్వానికి రాసిన విజ్ఞప్తి లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు శారదాపీఠం న్యాయవాది తెలిపారు.
దీంతో ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.

వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే విశాఖలోని శారదాపీఠాధిపతిగా ఉన్న స్వరూపానందతో సీఎం జగన్కు సంబంధాలు ఉండేవి. ఆయన ఆశీస్సుల కోసం జగన్ పలుమార్లు ఆశ్రమానికి కూడా వెళ్లారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జగన్ స్వామి సూచనల మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే క్రమంలో స్వరూపానంద పుట్టినరోజు వేడుకలను ఆలయాల్లో నిర్వహించి కానుకలు పంపాలంటూ శారదాపీఠం చేసిన విజ్ఞప్తిని కూడా జగన్ సర్కార్ మన్నించింది. ఇప్పుడు దాన్ని హైకోర్టు కొట్టేసింది.












Click it and Unblock the Notifications