కీలక దశకు ఏపీ మూడు రాజధానులు- ఎల్లుండి నుంచి హైకోర్టు రోజువారీ విచారణ..
ఏపీలో నత్తనడకన సాగుతున్న మూడు రాజధానుల ప్రక్రియపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ ఎల్లుండి ప్రారంభం కానుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, స్ధానికులు, విపక్షాలు దాఖలు చేసిన దాదాపు వంద పిటిషన్లను హైకోర్టు ఇకపై రోజువారీ విచారించబోతోంది. మరోవైపు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పిల్లలు వాదినలు వినిపించేందుకు తరలివస్తుండటంతో విచారణ మరింత ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వాదన వినిపిస్తున్న ఈ కేసులో తీర్పుపైనా ఉత్కంఠ నెలకొంది.

మూడు రాజధానులపై రోజువారీ విచారణ..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినా వీటిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఏం చెప్పబోతోందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లుల ఆమోదం రాజ్యాంగ బద్ధంగా జరగలేదని విపక్షాలు, రైతులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ ప్రక్రియలో లోపాలను తెలుసుకునేందుకు హైకోర్టు ప్రయత్నించనుంది. రాజధాని బిల్లులు, రాజధాని తరలింపుకు సంబంధించి దాదాపు వంద పిటిషన్లు దాఖలు కావడంతో ఇందులో ఉన్న అంశాల తీవ్రత దృష్ట్యా సోమవారం నుంచి రోజువారీ విచారణకు హైకోర్టు సిద్ధమవుతోంది. రోజువారీ విచారణ అనేది కొన్ని ప్రత్యేక కేసుల్లో అరుదుగా జరిగే పరిణామం. కేసు తీవ్రత, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాల్సిన పరిస్ధితి ఉంటే తప్ప ఒకే కేసును రోజువారీ విచారణ జరపడం అనేది కూడా సాధ్యం కాదు. దీంతో మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు రోజువారీ విచారణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రంగంలోకి సుప్రీం జడ్జీల పిల్లలు..
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లలో రైతుల తరఫున వాదించేందుకు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే కుమార్తె, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ కుమారుడు రంగంలోకి దిగారు. దీంతో ఈ కేసు విచారణ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు కీలక కేసులు వాదించిన అనుభవం ఉన్న వీరిద్దరూ రాజధాని వ్యవహారంలో రైతులకు అనుకూలంగా వినిపించే వాదనలు మరింత కీలకం కానున్నాయి. ఎందుకంటే వీరి వాదనల ఆధారంగా ఇచ్చే తీర్పును ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే వీరు రైతుల తరపున పిటిషన్లు వాదిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన ధర్మాసనం నుంచి జస్టిస్ బాబ్డే, జస్టిస్ నారిమన్ తప్పుకున్నారు.

రాజ్యాంగ ధర్మాసనం తలుపు తడతారా ?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం రెండు బిల్లులను అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించింది. కానీ మండలిలో మాత్రం ఓసారి సెలక్ట్ కమిటీకి పంపింది. మరోసారి అసలు చర్చకే తీసుకోలేదు. దీంతో మండలితో సంబంధం లేకుండా ఈ బిల్లులు ఆమోదించడం రాజ్యాంగబద్ధమా కాదా అనే దానిపై హైకోర్టు విచారణ కీలకం కానుంది. రాజ్యాంగబద్ధమైన అంశం కావడంతో ఈ వ్యవహారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడిన అయోధ్య వంటి పలు కీలక కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనానికి విచారణ బదిలీ చేసింది. ఇందులోనూ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం రాజ్యాంగ బద్ధతపై కీలక వాదనలు జరిగే అవకాశం ఉందని అర్ధమవుతోంది.
Recommended Video

విచారణ ఆలస్యమైతే విశాఖకు జగన్...
మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టనుండటంతో ఇక ప్రభుత్వంపైనా ఆ మేరకు ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. రోజువారీ విచారణ ద్వారా పిటిషన్లలో అంశాలను ఏకమొత్తంగా విచారించి త్వరలోనే దీనికి హైకోర్టు ఓ పరిష్కారం చూపిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఎలాగో విశాఖకు రాజధాని తరలింపు లేనట్లే. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే రాజధాని తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆ లోపు రాజధాని బిల్లులపై స్పష్టత వచ్చేస్తే అధికారుల కంటే ముందు సీఎం జగన్ విశాఖకు తరలివెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి. విచారణ ఆలస్యం అవుతుందని భావిస్తే మాత్రం సీఎం జగన్ ముందే విశాఖకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సీఎం జగన్ విశాఖ వెళ్లే అంశం హైకోర్టు విచారణతో ముడిపడి ఉన్నట్లే అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications