AP Govt: టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై నేడు హైకోర్టు నిర్ణయం-సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభత్వం ఈ రెండు పరీక్షల్ని వాయిదా వేసిన నేపథ్యంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది..
ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో అయితే రోజుకు దాదాపు 3 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షల్ని వాయిదా వేయడం కాదు రద్దు చేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
గతంలో హైకోర్టు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు న్యాయస్ధానానికి తెలిపింది. దీంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ కల్లా పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని సూచించినా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ హైకోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. ప్రభుత్వం పరీక్షల రద్దుకు మొగ్గుచూపకపోవడంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నవేళ హైకోర్టు తీసుకునే నిర్ణయంపైనా ఉత్కంఠ కొననసాగుతోంది.