చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ? నేడు తేల్చబోతున్న హైకోర్టు..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయనకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. రెగ్యులర్ బెయిల్ పై విచారణను మాత్రం ఇవాళ్టికి వాయిదా వేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టబోతోంది.

స్కిల్ కేసులో చంద్రబాబును ఏ37గా చేరుస్తూ సెప్టెంబర్ లో అరెస్టు చేసిన సీఐడీ.. ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ సమర్పించి రాజమండ్రి జైలుకు పంపింది. అక్కడ 52 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత అనారోగ్య కారణాలతో తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28న తిరిగి లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాదులు అప్పటికే రెగ్యులర్ బెయిల్ కు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు తీర్పు ప్రకటించనుంది.
స్కిల్ కేసులో చంద్రబాబు మినహా మిగిలిన నిందితులందరికీ ఇప్పటికే ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ లేదా రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. చంద్రబాబుకు కూడా మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే విషయంలో సీఐడీ హైకోర్టుకు ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ ను హైకోర్టు ఆమోదిస్తే ఆయన తిరిగి లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా తిరస్కరిస్తే మాత్రం ఆయన గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు మేరకు రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది.
ఒకవేళ ఇవాళ చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు తిరస్కరిస్తే తిరిగి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వాస్తవానికి దీపావళి సెలవుల తర్వాత స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా లేదా అన్నది ఇవాళ తేలిపోతుంది. ఇవాళ తేలకపోతే మాత్రం సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ తీర్పుతో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications