అమరావతి భూములు పంచొద్దు-సీఆర్డేయేకు సర్కార్ ఆదేశాలు చెల్లవు ! హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అమరావతి రాజధాని కోసం గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల పట్టాల కోసమంటూ ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సీఆర్డీయే చట్టంలో ప్రభుత్వం చేసిన సవరణల్ని ఆక్షేపించింది. సీఆర్డీయే, ప్రభుత్వం ఒక్కటి కావని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
అమరావతిలో ఇతరులకు భూములు
అమరావతిలో రాజధాని కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం దాదాపు 33 వేల ఎకరాలను భూసమీకరణ పద్ధతిలో సేకరించింది. ఇందులో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుతో పాటు పలు నిర్మాణాలు చేసింది. ఇంకా మిగిలిన భూముల్లో శాశ్వత నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఈలోపే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. అమరావతిలో ఇతరులకు ఉచితంగా భూములు కేటాయించేందుకు సిద్ధమైంది.
ఇందు కోసం సీఆర్డీయే చట్టంలో సవరణలు చేసి అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. ఇందుకు అనుగుణంగా భూముల్ని వేరే ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్ధలాలకు పంచేందుకు వీలుగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది వివాదాస్పదంగా మారింది.
అమరావతి పందేరంపై హైకోర్టు విచారణ
అమరావతిలో రాజధాని కోసం సేకరించిన భూముల్ని ఉచితంగా ఇతరులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. అసలు అమరావతిలో భూములు ఇతరులకు ఇవ్వాలా వద్దా అన్న దానిపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు కూడా వేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. దీనిపై ఇవాళ కూడా మరో విడత విచారణ చేసేందుకు హైకోర్టు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అమరావతి రాజధాని కోసం సేకరించిన భూముల్ని ఇతర ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అమరావతిలో నిర్ధిష్ట అవసరాల కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అమరావతి భూముల పంపకం కోసం ప్రభుత్వం సీఆర్డీయే చట్టానికి చేసిన సవరణలు సరికాదని చెప్పినట్లయింది. అలాగే ఈ భూముల్ని పేదల ఇళ్ల స్ధలాల కోసం కేటాయించాలని సీఆర్డీయేను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు మరో క్లారిటీ ఇచ్చింది.
జగన్ సర్కార్ వాదన ఇదే!
హైకోర్టు వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ ప్రభుత్వం.. తమ వాదన వినిపించింది. అమరావతిలో ఇతరులకు భూములు కేటాయించే అధికారం తమకు ఉందని వాదించింది. అమరావతిలో ఐదు శాతం భూముల్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయించే అధికారం ఉందని హైకోర్టుకు తెలిపింది. సీఆర్డీయేతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ భూములు కోల్పోయేందుకు రైతులు అంగీకరించారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తుచేశారు.
రైతులు తమకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇమ్మని కోరే అధికారం మాత్రం ఉందని తెలిపారు. అయితే ముందుగా ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చాకే భూములు పంచుకోమని వారు కోరలేదని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఇవాళ దీనిపై మరోసారి విచారణ జరపబోతోంది.