Mokathoti Sucharita: పరిత్రాణాయ సాధూనాం..ప్రతి చర్యకూ..ప్రతిచర్య: ఏపీ హోం మంత్రి
అమరావతి: హైదరాాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు కామాంధులను తెలంగాణలోని ఎన్ కౌంటర్ చేయడం పట్ల ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఇలాంటి ఘతుకాలకు పాల్పడిన వారి వినాశనం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆ రాష్ట్ర పోలీసులను ఆమె ప్రశంసించారు. అభినందనలను తెలియజేశారు.
భగవద్గీతలోని శ్లోకాలతో..
వెటర్నరి డాక్టర్ దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిన తరువాత.. ఆమె ఓ ట్వీట్ చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను ఇందులో పొందుపరిచారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. అని రాసుకొచ్చారు. ప్రతి చర్యకూ.. ప్రతిచర్య ఉంటుందని, ఇందులో భాగంగానే ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లు తాను భావిస్తున్నానని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్..
ఎన్ కౌంటర్ ఘటన నేపథ్యంలో సుచరిత.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి, పోలీసులకు సుచరిత కృతజ్ఞతలు తెలిపారు. ఘోరకృత్యాలకు పాల్పడిన వారికి ఇలాంటి శిక్షలే విధించాల్సిన అవసరం ఉందని తాను ఓ మహిళగా అకాంక్షిస్తున్నానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో అమ్మాయిలపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇదే తరహాలో ఎన్ కౌంటర్ చేయించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జస్టిస్ డెలివర్డ్..
కాగా- తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ఈ ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తం చేశారు. వెటర్నరి డాక్టర్ దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. జస్టిస్ డెలివర్డ్ అని ఆయన పోలీసుల చర్యను ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. నిందితులను ఎన్ కౌంటర్ చేశారనే సమాచారాన్ని ఆయన తన ట్వీట్ కు జోడించారు. డాక్టర్ దిశ హంతకులను ఉరి తీయాలంటూ ఇదివరకు పలు సందర్భాల్లో రాజాసింగ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications