అడ్మిషన్స్ ఓపెన్, జూన్ 1 నుంచి క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ఇంటర్మీడియట్ (జనరల్ & వొకేషనల్) కోర్సుల ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కళాశాలలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుంచే విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక అసలైన ప్రవేశాల ప్రక్రియ (Admissions) ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలై జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. అడ్మిషన్లు పూర్తి చేయడానికి జూన్ 1వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే, అదే రోజు అంటే జూన్ 1 నుంచే జూనియర్ కళాశాలల్లో క్రమబద్ధమైన తరగతులు ప్రారంభం కానున్నాయి.

అన్ని కళాశాలలకు ఒకే నిబంధన..
ఈ అడ్మిషన్ల షెడ్యూల్ రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, రెసిడెన్షియల్, సాంఘిక మరియు గిరిజన సంక్షేమ కళాశాలలతో పాటు మోడల్ స్కూల్స్, ఇంటర్ కోర్సులు అందించే డిగ్రీ కళాశాలలు కూడా ఈ గడువులోనే ప్రవేశాలు పూర్తి చేయాలి. అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా 'UDISE Plus' పోర్టల్లో నమోదు చేయాలని ప్రిన్సిపాల్స్కు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
తల్లిదండ్రులకు బోర్డు విజ్ఞప్తి..
రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాల్లో ఏకరూపతను తీసుకురావడానికి మరియు ప్రవేశ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ షెడ్యూల్ను రూపొందించినట్లు బోర్డు తెలిపింది. చివరి నిమిషంలో ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిర్ణీత తేదీల లోపే తమకు నచ్చిన కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రంజిత్ బాషా సూచించారు. సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా తమకు నచ్చిన గ్రూపులను పొందే అవకాశం ఉంటుందని విద్యా నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications