ఏపీ జేఏసీ అమరావతి కీలక నిర్ణయం..! చంద్రబాబుతో చర్చల ఎఫెక్ట్..!
ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ, ఐఆర్, ఇతర బకాయిలపై మూడు దశల ఉద్యమం చేస్తున్నారు. ఇది జిల్లాల్లో నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. నిన్న సీఎం చంద్రబాబుతో ఉద్యోగ నేతలు చర్చలు జరిపారు. ఇందులో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిగిలిన సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమం కొనసాగించాలా వద్ద అన్న ప్రశ్న ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravati) ఉద్యోగుల ముందు నిలిచింది.
ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలపై చర్చించింది. అనంతరం ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎంతో తమ చర్చల వివరాలను తమ కార్యవర్గానికి తెలిపామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని విషయాలపై స్పష్టత రాలేదన్నారు. నిన్న జరిగిన చర్చల్లో సీఎం చంద్రబాబు ఐఆర్, బకాయిలపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

వాస్తవానికి నిన్న జరిగిన చర్చల్లో పే-రివిజన్ కమిషన్ నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే 2 పెండింగ్ డీఏలను విడుదల చేస్తామన్నారు. దీంతో పాటు గత ప్రభుత్వం రద్దు చేసిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్దరిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈహెచ్ఎస్ స్ట్రీమ్ లైన్, 2022 ఏడాది సరెండర్ లీవుల విడుదల వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి తెలిపారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఏటా రూ.2,880 కోట్లు ఖజానాకు ఖర్చు కానుంది.














Click it and Unblock the Notifications