ఏపీ సర్కార్ కు మహిళా ఉద్యోగుల డిమాండ్స్-చైల్డ్ కేర్ లీవ్, ఐఆర్, డీఏల సహా..!
ఏపీలో మహిళా ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో పాల్గొన్న మహిళా ఉద్యోగులు.. ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు పెట్టారు. వీటిని తక్షణం పరిష్కరించాలని వారు కోరారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా రెండు సంవత్చరాల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు, కూటమి ప్రభుత్వ హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటన, పెండింగ్ డి ఏ ల మంజూరు వంటివి ఉన్నాయి.
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులకు అర్హులంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆ పిల్లలును పెంచడానికి శిశు సంరక్షణ సెలవలు (చైల్డ్ కేర్ లీవ్) కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగినులకు గత పదేళ్లుగా రెండు సంవత్చరాలు ఇస్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు మాసాలు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ ఇస్తున్నారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ కూడా మహిళా ఉద్యోగినులకు రెండు సంవత్చరాల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలన్నారు.

మహిళా ఉద్యోగినులకు శిశు సంరక్షణ సెలవులు వినియోగంలో పిల్లల వయో పరిమితి ఎత్తివేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఆర్థిక శాఖ నుండి ఇంకా ఉత్తర్వులు రాలేదన్నారు. నేటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదని, కాబట్టి తక్షణమే ప్రభుత్వం సదరు ఉత్తర్వులు అమలు పరిచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శిశు సంరక్షణ సెలవలు 10 స్పెల్స్ లో మాత్రమే వాడుకోవాలి అనే షరతు పెట్టినందున, ఒక రోజు, రెండు రోజులు పిల్లల అవసరానికి సెలవులు పెడితే త్వరగా పది స్పెల్స్ అయిపోతున్నాయని, కనుక ఛైల్డ్ కేర్ లీవులు స్పెల్స్ తో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు మహిళా ఉద్యోగినులు వాడుకొనే వెసులుబాటు కల్పించాలనీ కోరారు.

అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఐ.ఆర్ ఇప్పటికీ ప్రకటించకపోవడం, ఇప్పటికే రావాల్సిన నాలుగు డి.ఏ లు ప్రకటించకపోవడం, ఉద్యోగులు కుటుంబ ఆవసరాలకోసం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఉద్యోగి, పెన్షర్ కూడా ఆర్దికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కనుక, ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు రావాల్సిన డి.ఏ లు, పీఆర్సీ కమిషనర్ ను నియమించి, కూటమి ప్రభుత్వ హామీ మేరకు ఐ.ఆర్ ప్రకటించాలని కోరారు. బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో ప్రతి ఉద్యోగి, పెన్షనర్ పే స్లిప్పులలో వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.












Click it and Unblock the Notifications