జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు...సర్వ సన్నద్దం:సర్వత్రా ఆసక్తి
Recommended Video
గుంటూరు: గుంటూరు జిల్లా నాగార్జునా యూనివర్శిటీ ఎదుట ప్రాంగణంలో నేడు జరగనున్నజనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నిర్వహిస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ కావడం...రాజకీయపరంగా ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్న తరుణం కావడంతో ఈ బహిరంగ సభను అత్యంత ఆట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే సభా ప్రాంగణాన్ని సభ నిర్వాహక విభాగం సర్వ సన్నద్దం చేయగా...మరో వైపు రూట్ మ్యాప్ ను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. సభకు వచ్చేవారికి అన్ని వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా...సభా వేదిక, సీటింగ్ తో పాటు పార్కింగ్ వివరాలను సైతం ఆ మ్యాప్ లో వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజకీయంగా...అత్యంత కీలక తరుణంలో...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు పూర్తి విభిన్నంగా మారిపోయిన తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నపార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ లో ఆ పార్టీ దశ,దిశ వెల్లడికాబోతున్నాయి. ఈ వేదికపై నుంచే పవన్కల్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించడం ఖాయమంటున్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మార్చి 14న అన్నీ చెబుతానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ భవిష్యత్ కార్యాచరణను అదేవిధంగా 12 మంది సభ్యులతో పార్టీ విధాన కమిటీని కూడా ఇదే వేదికగా ప్రకటించనుడటం వంటివి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు, ఇచ్చిన హామీలు నెరవేర్పు విషయంలో భిన్న వైఖరి, ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో పవన్-జనసేన వేయబోయే అడుగులు ఎలా ఉంటాయనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.
నాలుగేళ్లయినా...ఇదే తొలి బహిరంగ సభ...
జనసేన పార్టీ నాలుగేళ్ల కిందట ఆవిర్భవించినప్పటికీ పార్టీ ప్రకటించిన తరువాత రాష్ట్ర స్థాయిలో ఈ తరహా సభ ఇంతకు ముందు ఎప్పుడూ నిర్వహించకపోవడం గమనార్హం. రాజధాని నడిబొడ్డున నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్మిషన్ ప్రాంగణంలోని సువిశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. పార్టీ బ్యానర్ మీద నిర్వహిస్తున్న బహిరంగ సభ ఇదే కావడంతో పార్టీ వర్గాలు సభ విజయవంతంపై ప్రత్యేక దృష్టిసారించాయి. సభా వేదిక విషయాని కొస్తే 100 మీటర్ల వెడల్పు...50 మీటర్ల పొడవు...10 అడుగుల ఎత్తులో అత్యంత ఆర్భాటంగా నిర్మించారు. సభలో ఏ మూలన ఉన్నా పవన్ కల్యాణ్ కనబడేలా...ఆయన ప్రసంగాన్ని స్పష్టంగా వినగలిగేలా 50కు పైగా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
ఇల్లు ఇక్కడే...అందుకే ఇక ఇక్కడే...
రాజధాని ప్రాంతమైన మంగళగిరి సమీపంలోని కాజాలో నివాసం ఉండటానికి పవన్ కల్యాణ్ సోమవారం ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇకమీదట ఇక్కడే ఉంటానని పవన్ స్పష్టంగా ప్రకటించిన తరువాతే ఈ సభ జరగనుండటం మరింత ప్రాధాన్యతను పెంచింది. పైగా ప్రస్తుతం సభ తలపెట్టిన ప్రాంగణంలోనే గత ఏడాది చేనేతల సమస్యలపై ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై నేతన్నలకు అండగా ఉంటానని, వారి సమస్యలపై పోరాటం చేస్తానని సంఘీభావం ప్రకటించారు. ఏడాది గడిచాక ప్రస్తుతం ఆదే వేదిక మీద పవన్ తన పార్టీ విధి విధానాలు, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తున్న వైనం, టిడిపి, వైసిపి ల లోటుపాట్లపై పవన్ ప్రత్యేకంగా ఈ సభలో గళమిప్పుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సభకు ఏర్పాట్లు ...ఏమీ లోటు లేకుండా...
ఈ సభకు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తరలి వస్తారని, వారందరూ సదస్సుకు తరలించేందుకు గాను పార్టీ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది జనసేన యువకులు, కళాకారులు మంగళవారం సాయంత్రం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి తాగునీరు, మజ్జిగ అందించటానికి పార్టీ నేతలు పెద్దఎత్తున తాగునీటి, మజ్జిగ ప్యాకెట్లను సభా ప్రాంగణానికి చేర్చారు.
సభ ప్రారంభానికి ముందు...పార్కింగ్ కోసం...ప్రత్యేక ఏర్పాట్లు...
సభ ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. మైకు సెట్ల ఏర్పాటు విషయమై ప్రత్యేక శ్రద్ద వహించారు. సభ సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా శిక్షణ పొందిన విద్యార్థులు వాలంటీర్లుగా వ్యవహరించడంతో పాటు పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది 500 మందికి పైగా ఉంటారని వీరే పాస్లు చూసి సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారని జనసేన నేతలు వెల్లడించారు. సదస్సుకు తరలివచ్చే జనాలు సభా ప్రాంగణం వద్దకు వాహనాలతో వచ్చేస్తే తిరుగు ప్రయాణం సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ముందుగానే ఒక ఆలోచించిన జనసేన నేతలు పోలీసుల సహకారంతో సభా ప్రాంగణానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలుపుదల చేసుకునేలా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. కార్లు, భారీ వాహనాలు, బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఇలా వేర్వేరుగా పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.