స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏ నంటూ మోసాలు- నకిలీగా తేల్చిన అధికారులు
ఏపీలో నకిలీల బెడద అంతకంతకూ పెరిగిపోతోంది. నకిలీ అధికారుల పేరుతో తాజాగా పలువురు వీఐపీలను బోల్తా కొట్టిస్తున్న వ్యవహారాలు వెలుగు చూస్తుండగా.. ఇదే కోవలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏగా చెప్పుకుంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి పలు మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం స్పందించింది.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకుంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి పలు మోసాలకు పాల్పడుతున్నాడు. నకిలీ గుర్తింపు కార్డు ధరించి ప్రభుత్వ కార్యాలయాల్లో తిరుగుతూ అధికారులు, సిబ్బందిని ప్రలోభపెడుతున్నట్లు తెలిసింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సోమేశ్వరరావు దందాపై తమకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సోమేశ్వరరావుకు అసెంబ్లీ కార్యాలయంతో కానీ అధికారులు, స్పీకర్తో కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
సోమేశ్వరరావు అనే వ్యక్తి ప్రభుత్వ అధికారులను ప్రలోభపెడుతూ పనులు చక్కబెట్టుకుంటున్నాడు. దీంతో సోమేశ్వరరావు వలలో పడొద్దని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.