స్థానిక ఎన్నికలు బ్యాలెట్ తోనే - కొత్త లెక్కలు, నిర్ణయం వెనుక..!?
ఏపీలో స్థానిక సమరానికి సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం వచ్చే నెల తొలి వారంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. న్యాయ పరమైన అడ్డంకులు వస్తే మినహా అక్టోబర్ నెలాఖరు లోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం రాజకీయంగానూ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి- వైసీపీ సై అంటున్నాయి. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ స్థానిక ఎన్నికలను నిలుపుదల చేయాలని వైసీపీ తాజాగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే, 2025 ఎన్నికల జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాలనే వినియోగించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను సమీకరించే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి మొత్తంగా 1.50 లక్షల బ్యాలెట్ బాక్స్ లను తెప్పించాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బాక్సులు వినియోగానికి వీలుగా లేవని తాజాగా అధికారులు గుర్తించారు. మున్సిపల్, పంచాయితీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను వినియోగించే విధంగా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సమీపిస్తున్న ఎన్నికల గడువు
పంచాయితీ ఎన్నికలను తొలుత ఈవీఎం ల విధానం లో నిర్వహించాలని అధికారులు భావించారు. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో అన్ని స్థానిక ఎన్నికలను ఈవీఎం లతో నిర్వహించాలనే ఉద్దేశం.. వీటి కొనుగోలుకు పంచాయితీ రాజ్,మున్సిపల్ అధికారు లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయితీ ఎన్నికలకు మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయని అంచనా. నాలుగు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు.. 82,602 బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని భావించారు. ఈవీఎంల కొనుగోలుకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు గడువు సమీపిస్తున్న వేళ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications