స్థానిక ఎన్నికలపై ఈసీ భేటీ: ఇదా సమయం అంటూ ప్రతిపక్షాలు, డోంట్వర్రీ అంటూ అధికారపక్షం
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ నీలం సాహ్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు ఎన్నికల కమిషనర్.
ప్రతి బ్యాలెట్.. కరెన్సీ నోటుతో సమానం..
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహణ ఎంతో సున్నితమైన అంశమని, ఎన్నికల సమయం తక్కువుగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రతి బ్యాలెట్ పేపర్ కరెన్సీతో సమానమన్న విషయాన్ని గుర్తుంచుకొని విధులు నిర్వర్తించాలన్నారు. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు. .
మద్యం, డబ్బుల పంపిణీపై నిఘా..
సీఎస్ నీలం సాహ్నీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బులు, బహుమతులు పంపిణీ చేసేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని అన్నారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు వి విజిల్ తరహాలో చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక ఎన్నికలకు ఇదా సమయం?
అన్ని రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జోగి రమేష్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, ఆలపాటి రాజా, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. సిపిఎం నుంచి వైవీ రావు, జనసేన పోతిన వెంకట మహేష్, సిపిఐ నుంచి జెల్లీ విల్సన్ హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటోన్నామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. కాగా, ఇప్పటికిప్పుడే ఎన్నికలను నిర్వహించడం సమంజసం కాదని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. కరోనా వైరస్ ముప్పు పోంచి ఉన్నందున్న ఇప్పుడున్న పరిస్థితిలో ప్రచారానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని విపక్షాలు తెలిపాయి.
సిద్ధంగా ఉన్నామంటూ అధికార పక్షం
కరోనా కారణంగానే లండన్లో కూడా ఎన్నికలను వాయిదా వేశారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి విపక్షాలు. ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకగా ఉందని పార్టీలు ఆరోపించాయి. అయితే, అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్దంగా ఉందని.. ఎటువంటి సంకోచాలు అవసరం లేదని అధికార వైసీపీ ప్రతినిధి జోగి రమేష్ స్పష్టం చేశారు. కాగా, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.