పార్ట్ టైం పాలిటిక్స్కు కాలం చెల్లింది: తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరన్న బాబు
అమరావతి: ప్రజాప్రతినిధులపై మూడు నెలలకొకసారి సర్వే చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శిక్షణా తరగతుల్లో ఆఖరి రోజైన గురువారం కార్కకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సర్వేల వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందజేస్తామని ఆయన అన్నారు.
నివేదిక చూసుకుని ఎమ్మెల్యేలు లోపాలను సవరించుకోవాలని అన్నారు. అందరూ వచ్చే ఎన్నికల్లో గెలవాలనేదే తన తపన అని తెలిపారు. అధికారంలో ఉండి తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేసినా ప్రజలు పట్టించుకోరని అన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సేవలు అందకపోతే ప్రజలు సహించరని అన్నారు. అధికారంలో ఉన్న వారు తప్పు చేస్తే ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇప్పుడేమీ మాట్లాడరని, ఎన్నికల్లో సైలెంట్గా జడ్జిమెంట్ ఇస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పనుల్లో కుటుంబ సభ్యులు జోక్యాన్ని రానివ్వద్దని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ డ్యాష్ బోర్డులో ఎమ్మెల్యేల పనితీరు మొత్తం రికార్డు అవుతుందని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రజల్లో 80 శాతం సంతృప్తి చెందాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.
రాజకీయ ఏకీకరణ 80 శాతం జరగాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ప్రభుత్వ పథకాలపై ఉన్న సానుకూలతను పార్టీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. నేతల మధ్య విభేదాలను సహించనని చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో పార్ట్ టైం పాలిటిక్స్కు కాలం చెల్లిందని, ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు.
మీ ఇగో మీతోనే పోదు. పార్టీకి కూడా అంటుకుంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. మనల్ని మనమే ఇరుకున పెట్టుకునేలా వ్యవహరించకండని ఆయన అన్నారు. పనులు తీసుకుని అవినీతికి పాల్పడితే సహించమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం తెలిపారు.
ప్రభుత్వంపై పట్టు సాధించాం.. పరుగులు తీయిస్తున్నామని ఆయన చెప్పారు. నియోజకవర్గాలపై మీ పట్టు సడలనివ్వకూడదని నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో మనకు మద్దతు ఇవ్వని వర్గాలు కూడా ప్రస్తుతం మన సంక్షేమ కార్యక్రమాలతో చేరువవుతున్నారని సీఎం అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చేసిన ప్రయోజనాలను త్వరలో చేపట్టనున్న జనచైతన్య యాత్రలలో వివరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.












Click it and Unblock the Notifications